నిర్మల్ : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ వరాల వర్షం కురిపించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులందరికీ నవంబర్ నెలలో ల్యాప్టాప్లు అందజేస్తామని తెలిపారు. క్యాంపస్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ట్రిపుల్ ఐటీని సందర్శించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు.
మళ్లీ నవంబర్లో విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇవ్వడానికి వస్తాను. అప్పటివరకు ఆడిటోరియంను మరింత అభివృద్ధి చేయాలి. కొత్త మౌలిక వసతులు కల్పించే బాద్యత నేను తీసుకుంటానని చెప్పారు. బాసర ట్రిపుల్ ఐటీలో డిజిటల్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాము. పిల్లలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాము. క్యాంపస్లో మినీ టీ హబ్ ఏర్పాటు చేస్తాము. విద్యార్థులు తయారుచేసిన ఉత్పత్తులతో ప్రతీ సంవత్సరం వారం రోజులు ఇన్నోవేషన్ వారోత్సవాలు జరగాలి. అమెరికాలోని MIT లాగా బాసర ట్రిపుల్ ఐటీ మారాలి. MIT ల్యాబ్ నుంచి వచ్చిన కంపెనీలు అంతర్జాతీయ ఖ్యాతి పొందాయి. పరిశోధనలే నవీన ఆవిష్కరణలకు ఊతం ఇస్తాయి. ఆవిష్కరణల నుంచి కంపెనీలు పుడతాయి. ఆ కంపెనీల నుంచి ఉద్యోగాలు, సంపద పుడతాయి. బాసర ట్రిపుల్ ఐటీలో ఇన్నోవేషన్ ల్యాబ్ -మిని టీ హబ్ ఐటీ, విద్యాశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేస్తాము. అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అడిగిన ప్రతీ విజ్ఞప్తిని అంగీకరించడని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని కేటీఆర్ తెలిపారు. మీరందరూ వెళ్లి భరోసా ఇచ్చిరండని కేసీఆర్ చెప్పినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. రూ. 3 కోట్లతో మిని స్టేడియం ఏర్పాటు చేస్తాము. ఆరు నుంచి ఎనిమిది నెలల లోపు అది పూర్తవుతుంది. 1000 కంప్యూటర్లతో ఆధునిక డిజిటల్ ల్యాబ్ ఏర్పాటుచేస్తాము. 50 అదనపు మోడర్న్ క్లాస్ రూంలు, మోడ్రన్ ఫర్నీచర్తో ఏర్పాటు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
మీ యూనివర్సిటీని మీరే బాగా చూసుకోవాలని చెప్పి తన జపాన్ అనుభవాన్ని కేటీఆర్ విద్యార్థులతో పంచుకున్నారు. అక్కడ శుభ్రతకు ఇచ్చే ప్రాముఖ్యతను వివరించారు. క్యాంపస్ మేయింటనెన్స్ అనేది సమష్టి బాధ్యత. బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలి. నెలకొక్కసారైనా శ్రమదానం చేపట్టండని కేటీఆర్ పిలుపునిచ్చారు.