రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 15వేల మందితో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్న వజ్రోత్సవ సభకు హాజరవుతారు. ఈ సభలో అర్హులైన కొత్త ఆసరా లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేసి, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు వేములవాడ చేరుకుంటారు. ఆలయ చెరువు మైదానంలో 15 వేల మందితో జరిగే వజ్రోత్సవ వేడుకలకు హాజరై ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. శనివారం ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. మంత్రి రాక సందర్భంగా సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
టీపీటీడీసీఎల్ చైర్మన్ గూడూరికి కేటీఆర్ అభినందన
తెలంగాణ పవర్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీపీటీడీసీఎల్) చైర్మన్గా నియామకమైన గూడూరి ప్రవీణ్ గురువారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సిరిసిల్ల జిల్లా నాయకులతో కలిసి వెళ్లి తన నియామకానికి సహకరించిన మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గూడురిని కేటీఆర్ అభినందించారు. – సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 15