ఒక పార్టీని ఓడించి.. ఇంకో పార్టీ గద్దెనెక్కాలన్నది మా విధానం కాదు. అధికారమొక్కటే మాకు పరమావధి కాదు. ప్రజల మౌలిక అవసరాలైన తాగు, సాగునీరు, రైతులు, దళితులు తదితరులకు మేలు జరగాలన్నదే మా రాజకీయ లక్ష్యం. వీటిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉండగా.. కులం, మతం ప్రాతిపదికగా ప్రజలను విడదీస్తున్నారు. మేం తెలంగాణ కోసం 14 ఏండ్లు కొట్లాడాం. కేంద్రంలో మార్పుకోసం అలుపెరు గకుండా పోరాటం చేస్తాం.
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ మాడల్ను దేశమంతా పరిచయం చేస్తామని ఐటీ, పురపాలక శాఖల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సుదీర్ఘ మథనం తర్వాతే బీఆర్ఎస్ను స్థాపించారని చెప్పారు. 21 ఏండ్ల కిందట టీఆర్ఎస్ను స్థాపించినప్పుడు కూడా ఇలాగే అనుమానించారని, ఆయన సారథ్యంలో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించడమే కాక, దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ను సైతం ముందుచూపుతో ఏర్పాటు చేశారని, 2024 సార్వత్రిక ఎన్నికలే తమ టార్గెట్ అని స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ కేంద్రంగానే బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు. మోదీ హయాంలో 8 ఏండ్లలో దేశం అధోగతి పాలైందని, ఆయన ప్రధానిగా కాకుండా ప్రచార మంత్రిగా మారిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, రాహుల్ గాంధీది జోడో యాత్ర కాదని.. చోడో యాత్ర అని అన్నారు.
2024 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అందుకోసం తమ కార్యక్షేత్రాన్ని ఎంచుకున్నామని తెలిపారు. ‘అరవింద్ కేజ్రీవాల్ పార్టీ మొదట్లో ఢిల్లీలో ఉండె. ఆ తరువాత పంజాబ్లో..ఇప్పుడు హర్యానా.. ఆ చుట్టుపక్కల రాష్ర్టాల్లో విస్తరిస్తున్నది. అలాగే మేం కూడా. టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరును తెలంగాణ సరిహద్దు రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలకు తెలుసు. మహారాష్ట్రలో వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మా కార్యక్షేత్రం అక్కడే. అలాగే కార్ణటకలో జేడీఎస్ నేత కుమారస్వామి కలిసి వస్తామని చెప్పారు.
21 ఏండ్ల కింద ఇలాగే అన్నారు
దేశంలోని వివిధ పార్టీల రాజకీయ నేతలు, ప్రజాసంఘాలు, ఆర్థికవేత్తలు, వ్యవసాయ నిపుణులు.. పలు రంగాల మేధావులతో సీఎం కేసీఆర్ ఆరేడు నెలలు సుదీర్ఘ సమాలోచన చేసి బీఆర్ఎస్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకొన్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్పై కొందరు విమర్శలు చేస్తున్నారని, ఇవన్నీ తమకు సహజమేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతోనే తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని 21 ఏండ్ల కిందట నమ్మి, టీఆర్ఎస్ను స్థాపించిన వ్యక్తి సీఎం కేసీఆర్.
ఇప్పటిలాగే అప్పుడూ అనేక విమర్శలు వచ్చాయి. రాజకీయ అవకాశవాదంతో పార్టీ పెట్టారంటూ అనేక అవమానాలకు గురిచేశారు. ఆయన వల్ల ఏమవుతుందిలే అని కించపరిచారు’ అని గుర్తుచేశారు. కేసీఆర్ వల్ల తెలంగాణ ఏర్పాటై పదవులు పొందినవాళ్లు.. తెలంగాణ అద్భుతంగా నిర్మాణమైన తర్వాత.. ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. ‘కమిట్మెంట్.. కంటెంట్.. విజన్ ఉన్న నాయకుడు పార్టీ పెడితే ఏమవుతుందో, అన్ని ప్రతికూలతల మధ్య ఏం చేయగలరో గొప్ప ఉదాహరణ టీఆర్ఎస్. మనీ పవర్లేదు.. మజిల్ పవర్లేదు.. మీడియా పవర్ లేదు.. మాస్ బేస్ కూడా లేని ప్రతికూలతల మధ్య పార్టీ పెట్టి రాష్ర్టాన్ని సాధించిన నేత కేసీఆర్’ అని పేర్కొన్నారు.
అనుమానాలు, అవమానాల మధ్య పాలన
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వారికి పాలన రాదని, తెలివి లేదని, ప్రజలకు వీళ్లేం న్యాయం చేస్తారని, అసలు రాష్ట్ర మనుగడ ఉంటుందా? అని.. అనేక అనుమానాలు, అవమానాల మధ్య పాలన ప్రారంభించామని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ఎనిమిదేండ్లలోనే అనేక విప్లవాత్మక పథకాలతో దేశానికి దశను.. దిశను చూపే స్థాయికి తెలంగాణ ఎదగటం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో 25 లక్షల పంపుసెట్లున్నా, భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులున్నా తట్టుకుంటూ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వొచ్చని నిరూపించామని తెలిపారు.
‘ఈ రోజు సాంకేతిక కారణాల వల్ల పావుగంట కరెంట్ పోతేనే ఆగమాగం అవుతున్నాం. విద్యుత్తు అధికారులంతా ఏం చేస్తున్నారని ఫోన్లు, మేసేజ్లు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 7-8 గంటలే.. అదీ దశలవారీగా కరెంటు ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి ఉన్నదా?’ అని ప్రశ్నించారు. రైతుబంధు, రైతుబీమా, రైతు వేదికలు, రైతుబంధు సమితులు ఇలా అనేక రైతు అనుకూల విధానాలు అమలు చేసి వ్యవసాయం దండుగ కాదు పండుగ అని లాభసాటిగా చేసి చూపిన నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
కుట్రలను ఛేదిస్తాం
మమతా బెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్, అశోక్ గెహ్లాట్, సోనియాగాంధీ, రాహుల్గాంధీ, శివసేన నేత సంజ య్ రౌత్.. ఎవరినీ వదిలిపెట్టకుండా ఈడీ, సీబీఐలతో దాడులు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధార్మిక సంస్థలు ఇచ్చే విరాళాలతో బీజేపీ నడుస్తునట్టు.. ఆ పార్టీ అకౌంట్లో కేవలం రూ.6 కోట్లో..రూ.9 కోట్లో ఉన్నట్టు.. ఇతర పార్టీలన్నీ అవినీతి సొమ్ముతో నడుస్తున్నట్టు నిందలేయడం బీజేపీకి అలవాటైపోయిందని విమర్శించారు. బండి సంజయ్ లాంటి నాయకులు వారి భార్యల తాళిబొట్లు తాకట్టు పెట్టి ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు.. మిగితా పార్టీలేమో చాలా అన్యాయంగా అవినీతి పాల్పడుతున్నట్టు ఫోజు లు కొట్టడం సిగ్గుమాలిన తనమని మండిపడ్డారు.
మా టార్గెట్ 2024
2024 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అందుకోసం తమ కార్యక్షేత్రాన్ని ఎంచుకున్నామని తెలిపారు. ‘అరవింద్ కేజ్రీవాల్ పార్టీ మొదట్లో ఢిల్లీలో ఉండె. ఆ తరువాత పంజాబ్లో..ఇప్పుడు హర్యానా.. ఆ చుట్టుపక్కల రాష్ర్టాల్లో విస్తరిస్తున్నది. అలాగే మేం కూడా. టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరును తెలంగాణ సరిహద్దు రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలకు తెలుసు. మహారాష్ట్రలో వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మా కార్యక్షేత్రం అక్కడే. అలాగే కార్ణటకలో జేడీఎస్ నేత కుమారస్వామి కలిసి వస్తామని చెప్పారు.
‘సరిహద్దు రాష్ర్టాలపై తెలంగాణ ప్రభావం ఉన్నందున మా ప్రయాణం అక్కడి నుంచే మొదలవుతుంది. పార్టీ పెట్టగానే ఫలితం రావాలనే తొందరేం లేదు. సుదీర్ఘ పోరాటం తరువాత తెలంగాణను సాధించాం. అదే స్ఫూర్తితో దేశం మేలు కోసం పోరాటం చేస్తాం. కేసీఆర్కు ఓపిక ఉన్నది. మా అందరికీ ఓపిక ఉన్నది. కొట్లాడే శక్తి ఉన్నది. పదవులు.. అధికారం బీఆర్ఎస్ లక్ష్యం కాదు’ అని తెలిపారు. బీఆర్ఎస్ పదవుల గురించో.. అధికారం గురించో..కేసీఆర్ పోరాటం మొదలుపెట్టలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలో జరుగుతున్న పరిపాలనపై ప్రజల దృష్టిలో సరైన అంశాలను పెట్టాలనే ఆలోచనతోనే స్పష్టమైన వ్యూహంతో, అవగాహనతో బీఆర్ఎస్ను కేసీఆర్ ముందుకు తీసుకెళతారని చెప్పారు. దేశంలో 75 వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తున్నదని, వనరులున్నా వాడుకొనే తెలివి లేదని విమర్శించారు.
సమాఖ్యస్ఫూర్తిని అణచివేస్తున్నారు
మోదీ ఢిల్లీలో కూర్చొని సమాఖ్యస్ఫూర్తిని అణచివేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్య వీచికలు ప్రారంభమైన సెప్టెంబర్ 17ను స్వాతంత్ర వజ్రోత్సవాలుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. కేంద్రం ఉన్నపళంగా గతంలో ఎప్పుడూలేనివిధంగా ‘విమోచన దినం’ పేరుతో హైదరాబాద్లో కార్యక్రమాలు నిర్వహించటంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. టీం ఇండియా.. సహకార సమాఖ్య స్ఫూర్తి అని పదేపదే చెప్పే మోదీ.. తెలంగాణలో చేస్తున్నదేమిటని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అమిత్షా, ఏక్నాథ్ షిండే, 40 శాతం సీఎం బొమ్మై, నిస్సహాయ మంత్రి కిషన్రెడ్డి వంటివారు తెలంగాణపై ఎందుకు దండయాత్ర చేసినట్టు? అని నిలదీశారు.
‘బీఆర్ఎస్పై మోదీ ఏం చేస్తా రు? ఆయన ప్రచారం.. దుష్ప్రచారం.. వ్యూహాలు 8 ఏండ్లల్లో చాలా చూశాం. అన్నిటికీ సిద్ధమయ్యాం. బీజేపీ వలువలు విప్పి మార్కెట్లో నిలబెడతాం. బీజేపీ ఘాతుకాలను తెలంగాణలో, బయటా కచ్చితంగా ఎండగడతాం
ఆగస్టు 15 విమోచన దినమా?
ఒకవేళ సెప్టెంబర్ 17 విమోచన దినమే అయితే.. 75 ఏండ్ల తర్వాత కూడా నిజాంను, రజాకార్లను గుర్తుచేసుకునే దినమే అయితే.. ఆగస్టు 15న విమోచన దినం ఎందుకు కాదు? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘సెప్టెంబర్ 17న హైదరాబాద్ పాలకులు చేసిన అరాచకాలను చెప్పుకోవాలని అనుకుంటే.. ఆగస్టు 15న ఢిల్లీ ఎర్రకోట మీద నుంచి బ్రిటిష్వాళ్లు చేసిన దురాఘతాల గురించి ప్రధాని ఎందుకు మాట్లాడరు? బ్రిటిష్ మహరాణి చనిపోతే మనదేశంలో ఎందుకు సంతాపదినంగా ప్రకటించారు? ఇక్కడ ముస్లిం రాజు ఉండె కాబట్టి..హిందూ ముస్లిం పంచాయితీ పెట్టాలె. తెల్లతోలు వాళ్లను తిడితే ఓట్లు రావు. ఇదో రాజకీయ దివాళాకోరుతనం’ అని నిప్పులు చెరిగారు.
మోదీ.. ప్రచార్మంత్రి
కేంద్రంలోని బీజేపీ గోల్మాల్ గుజరాత్ మాడల్ను చూపి అధికారంలోకి వచ్చి 8 ఏండ్లల్లో దేశానికి ఏం చేసిందని మంత్రి కేటీఆర్ నిలదీశారు. మోదీ చేతగాని, పనికిమాలిన, అసమర్ధ, దద్దమ్మ ప్రధానమంత్రి అని నిప్పులు చెరిగారు. మోదీ తన బిల్డప్పులతో ప్రచార్ మంత్రిగా మారారని ఎద్దేవా చేశారు. వన్వే ట్రాఫిక్ మాదిరిగా మనం ఆయన మన్కీ బాత్ వినాలే తప్ప.. ఆయన జన్కీ బాత్ వినడని నిప్పులు చెరిగారు. ‘2014లో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గొప్పగొప్ప మాటలు చెప్పారు. ప్రధాని అయ్యాక వాటిని విస్మరించారు. దేశ ప్రజలను విచ్ఛినం చేయటంలో, అసత్యాలు చెప్పటంలోనే మోదీ విజయం సాధించారు. దురదృష్టవశాత్తు మీడియా వీటిని పట్టించుకోవడం లేదు. 8 ఏండ్ల మోదీ వైఫల్యాలను ఎండగడతాం. తెలంగాణ ప్రగతిని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తాం’ అని స్పష్టం చేశారు.
జోడో యాత్ర కాదు.. కాంగ్రెస్ చోడో యాత్ర..
కేసీఆర్ ఏం చేసినా స్పష్టమైన ఎజెండాతో..పరిపూర్ణ వ్యూహంతో చేస్తారని మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశంలో రాజకీయ శూన్యత ఉన్నదని, కాంగ్రెస్ పార్టీ అట్టర్ఫ్లాప్ అయిందని అన్నారు. నాయకత్వ సమస్యలతో ఆ పార్టీ సతమతం అవుతున్నదని, 50 ఏండ్లు దేశాన్ని పాలించిన పార్టీ 50 సీట్లకు పరిమితం కావడమే అందుకు నిదర్శమని ఎద్దేవా చేశారు. రాహుల్గాంధీ చేపట్టంది భారత్ జోడో యాత్రలా కాకుండా కాంగ్రెస్ చోడో యాత్రలా తయారైందని అన్నారు. ‘రాహుల్గాంధీ కేరళలో యాత్ర చేస్తే గోవా నుంచి 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవుతారని అనుకొంటుండగానే తిరుగుబాటు మొదలైంది. తెలంగాణలో ఒకరిద్దరు కాంగ్రెస్ ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని మాకు సమాచారం ఉన్నది’ అని పేర్కొన్నారు.
బీజేపీ నేతలపై దాడులేవీ?
బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ర్టాల్లో మోదీ ఆదేశాలతో ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ సంస్థలు బీజేపీ అనుబంధ సంఘాలుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. గడచిన 8 సంవత్సరాలలో ఎంతమంది బీజేపీ నేతల మీద ఈడీ, సీబీఐ దాడులు చేశాయని ప్రశ్నించారు. సీఎం రమేశ్, సుజనా చౌదరి లాంటి వాళ్లపై దాడులు అయినా..వాళ్లు బీజేపీలో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మాలా తెల్లగా అయిపోయారని ఎద్దేవా చేశారు. రాజకీయంగా వేధించటం.. భయపెట్టడం కోసం దాడులు చేస్తే లొంగిపోతారనుకోవడం అమాయకత్వమని అన్నారు.
రేపిస్ట్లకు పురస్కారాలా?
ఒక అమ్మాయిని రేప్ చేసిన 11 మంది గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ ఇచ్చి బయటకు తీసుకొస్తే ఏ మీడియా ఎందుకు రాయదని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలు దోషులకు దండలేసి సన్మానాలు చేస్తే ప్రశ్నించేందుకు మీడియా ధైర్యం ఎక్కడపోయిందని నిలదీశారు. బీజేపీలో ఉన్న మహిళా మం త్రులు గుజరాత్ సర్కార్ తీరుపై మాట్లాడకుండా ఎక్కడపోయారని ప్రశ్ని ంచారు. 11 మంది రేపిస్ట్లకు గుజరాత్లో బీజేపీ నాయకులు సంస్కారీ పురష్కారాలు ఇస్తుంటే ఈ దేశం చూస్తూ ఊరుకోవాలా? అని నిప్పులు చెరిగారు. ‘ఎంతమంది మీడియా ప్రతినిధులకు ధైర్యమున్నది? మీడియా వెన్నెముకను కోల్పోయి మోడియాగా మారింది. వలువలు విప్పి విలువలు లేని రాజకీయం చేస్తున్న బీజేపీ బట్టలు విప్పి దేశం ముందు నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రగతిని చూసి వెళ్తారు
రాహుల్గాంధీ రాష్ట్రంలో 15 రోజులే కాదు 15 నెలలున్నా ఏమీ కాదని, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి అభినందిస్తారని ఆశిస్తున్నానని కేటీఆర్ అన్నారు.‘ కర్ణాటక నుంచి తెలంగాణలో అడుగుపెట్టగానే 24 గంటలు ఉచిత విద్యుత్తు.. హరితహారం మొక్కలు స్వాగతం పలుకుతాయి. ప్రజల్లో సుఖసంతోషాలను చూసి అదే నవ్వుతో తిరిగి వెళ్తారు’ అని వ్యాఖ్యానించారు.