హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు టీకా వేసిన డాక్టర్ శ్రీకృష్ణ, నర్సు కెరినా జ్యోతికి మంత్రి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కరోనా విపత్తు వేళల్లో సేవలందిస్తున్న ఫ్రంట్లైన్ వారియర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో వరుస పండుగల దృష్ట్యా ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు సూచించారు. డెల్టా వేరియంట్ వ్యాప్తిని ప్రభుత్వ సహకారంతో వ్యూహాత్మకంగా ఎదుర్కొంటున్నామని ఆయన పేర్కొన్నారు. మంగళవారం కోఠిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. డెల్టా వేరియంట్ వ్యాప్తి (రెండో వేవ్) మరో రెండు నెలల వరకు కొనసాగుతుందని భావిస్తున్నామన్నారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వైరస్ వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని ఆయన కోరారు.