నారాయణపేట : నారాయణపేట జిల్లాలోని కంసాన్పల్లి రైతులకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు.
నియోజకవర్గ పరిధిలోని కంసాన్పల్లిలో ప్రభుత్వానికి సంబంధించిన స్థలం వెయ్యి ఎకరాలు ఉందని ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకొచ్చారని కేటీఆర్ తెలిపారు. అయితే ఇందులో 200 ఎకరాల్లో పేద రైతులు సాగు చేసుకుంటున్నారని, వారికి భూ యాజమాన్య హక్కు కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. మిగతా 800 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు 200 ఎకరాలు సాగు చేసుకుంటున్న రైతులకు తప్పకుండా యాజమాన్య హక్కులు కల్పిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామన్నారు. ఆ రైతులందరికీ రైతుబంధు ఇస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కూడా ఏర్పాటు చేసి నారాయణపేట నియోజకవర్గ ప్రజలకు అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. నారాయణపేట పట్టణానికి ఆధునీకమైన మాస్టర్ ప్లాన్ రూపొందించి, అందజేస్తామన్నారు. ఒక మానవ వ్యర్థాల శుద్దీకరణ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గిరిజన సోదరుల కోసం సేవాలాల్ భవన్ను కూడా మంజూరు చేయిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.