హైదరాబాద్ : తెలంగాణలో డెంగీ కేసులు పెరుగుతున్న క్రమంలో అందరూ అప్రమత్తం కావాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సూచించారు. డెంగీ నివారణకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు సమయాన్ని కేటాయించి, ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. డెంగీ నివారణ చర్యలపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కలిసి సంయుక్త సమావేశం నిర్వహించారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వైద్య, జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో డెంగీ నివారణ కోసం గత మూడేండ్లలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమం బాగా విజయవంతమైందన్నారు. ఆరోగ్య, పంచాయతీ, మున్సిపల్ శాఖల సిబ్బంది కలిసి పని చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయన్న హరీశ్రావు మాటతో తాను ఏకీభవిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలోని ఏయే వార్డుల్లో డెంగీ కేసులు అధికంగా ఉన్నాయో పరిశీలించాలని కమిషనర్లు, జోనల్, డిప్యూటీ కమిషనర్లను కేటీఆర్ ఆదేశించారు. అనంతరం నివారణకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఆదివారం పది గంటలకు పది నిముషాల కార్యక్రమంలో పిల్లలు, మహిళలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. మెప్మాను ఈ కార్యక్రమంలో వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.
డెంగీ నివారణ చర్యల్లో ప్రిన్సిపాల్స్, టీచర్లు, విద్యార్థులందరూ పాల్గొనేలా, సామాజిక బాధ్యతగా పని చేసేలా కార్యక్రమాలు రూపొందించాలని కేటీఆర్ సూచించారు. స్కూల్ ఎడ్యుకేషన్, మున్సిపల్ డిపార్ట్మెంట్, మెప్మా, విద్యార్థులు, పిల్లలన , ప్రజా ప్రతినిధులను, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సెలబ్రిటీలను వినియోగించుకోవాలి. రేడియో, లోకల్ టీవీలు, హోర్డింగ్స్ వంటివి పెట్టి ప్రజలను చైతన్యపర్చాలని సూచించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఐఎఎస్ అధికారులు కూడా తమ గృహాలలో ఈ కార్యక్రమం నిర్వహించాలని కేటీఆర్ చెప్పారు.