సిరిసిల్ల రూరల్, ఆగస్టు 4: టీఆర్ఎస్ సీనియర్ నేత బచ్చపల్లి తిరుపతి మృతిపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తంగళ్లపల్లి మండ లం జిల్లెల్లకు చెందిన తిరుపతి (39) రెండు నెలల క్రితం క్యాన్సర్ బారిన పడి, సికింద్రాబాద్లోని యశోద దవాఖానలో చికిత్స తీసుకుంటున్నాడు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో దవాఖానలోనే తుదిశ్వాస విడువగా, మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. వెంటనే సదరు దవాఖాన యా జమాన్యంతో మాట్లాడి బిల్లు మాఫీ చేయించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ సమకూర్చారు. కాగా, అక్క డే ఉన్న జిల్లెల్ల సర్పంచ్ మధు అన్ని ఏర్పాట్లు చేసి జిల్లెల్లకు మృతదేహాన్ని తీసుకువచ్చారు.
కన్నీటి వీడ్కోలు..
బచ్చపల్లి తిరుపతి టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నాడు. నాడు తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నాడు. స్వరాష్ట్రంలో గ్రామ అభివృద్ధితోపాటు పార్టీకి సేవలందిస్తున్నాడు. గురువారం ఉదయం తిరుపతి చనిపోవడంతో పార్టీ నాయకులు, ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. జిల్లెల్లలో అంత్యక్రియలు నిర్వహించగా, న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఆర్ఎస్ సీనియర్ నేత బొల్లి రాంమోహన్తోపాటు పలువురు నేతలు పాల్గొని నివాళులర్పించారు.