రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నీటి సంరక్షణ విధానాలు భారతదేశానికే దిక్సూచిగా మారాయి. యువ ఐఏఎస్లకు ఈ విధానాలు పాఠాలుగా మారడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నానని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో కేటీఆర్ రైతు వేదికను ప్రారంభించి ప్రసంగించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,603 రైతు వేదికలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిర్మించాం అని కేటీఆర్ తెలిపారు. ఈ రైతు వేదికల ద్వారా రైతులను సంఘటితం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి, రైతులకు మద్దతుగా ముందుకు వెళ్తుందన్నారు. ఈ రైతు వేదికల్లో స్థానిక రైతుబంధు సమితి అధ్యక్షులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పరస్పరం సంప్రదించుకుంటూ.. సరైన పంటలపై అధ్యయనం చేస్తారు. వ్యవసాయంలో జరుగుతున్న మార్పులు, ఏ రకమైన పంట వేస్తే లాభసాటి, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలపై చర్చిస్తారు. ఒక ఆలోచనతో కూడిన అర్థవంతమైన వ్యవసాయం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించాం. దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన విద్యుత్ను రైతులకు ఇస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు గోదావరి జలాలు తరలి రావడంతో ఒకట్రెండు కాదు.. 6 మీటర్లు భూగర్భ జలాలు మీదకు వచ్చాయి అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.