తెలంగాణ అభివృద్ధిలో భాగం పంచుకుని పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలని తెలంగాణ ఎన్నారైలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించేందుకు లండన్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. ఇక్కడ ప్రవాస తెలంగాణ సంఘాలు శనివారం ఏర్పాటు చేసిన మీట్ ఆండ్ గ్రీట్లో శనివారం ప్రసంగించారు. స్వరాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ సాధించిన విజయాలను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు చూపిన ఉద్యమస్ఫూర్తినే నేటికి కొనసాగిస్తూ.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలంగాణాన్నే వినిపిస్తున్నారని ఎన్నారైలను కేటీఆర్ ప్రశంసించారు. ఈ పర్యటనలో పలువురు విదేశీ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో తాను జరిపిన సమావేశాలు సంతృప్తికరంగా సాగాయని వెల్లడించారు. త్వరలోనే వాటి ఫలితాలు కనిపిస్తాయన్నారు. పెట్టుబడులను ఆకర్షించి, తెలంగాణ యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభించేలా చూడడమే తన ప్రథమ కర్తవ్యం అని కేటీఆర్ చెప్పారు. రాబోయే కాలంలో యునైటెడ్ కింగ్డమ్తో తెలంగాణ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్న నమ్మకం తనకుందన్నారు.
స్వరాష్ట్రంలో కంపెనీలు స్థాపించాలి..
స్వరాష్ట్రంలో కంపెనీలు స్థాపించి, సంపద సృష్టించాలని ఎన్నారైలను మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్తోపాటు మిగతా పట్టణాలు, నగరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత అభివృద్ధిని వికేంద్రికరించామని తెలిపారు. అందులో భాగంగానే ఖమ్మం, కరీంనగర్లో ఐటీ టవర్స్ను ప్రారంభించామని, త్వరలోనే మహబూబ్నగర్లోనూ ఐటీ పరిశ్రమలు తమ కార్యకలాపాలు మొదలుపెడతాయన్నారు. ఇప్పటికే వరంగల్లో ఐటీతో పాటు ఇతర పారిశ్రామిక సంస్థలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు.
సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన కరెంట్తోపాటు పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేవలం నాలుగేళ్లలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంను పూర్తిచేయడం కేసీఆర్ కార్యదక్షతకు నిదర్శనమన్నారు. తెలంగాణలోని లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం తెలంగాణలో ఉండడం ప్రతీ ఒక్కరు గర్వించే విషయమని పేర్కొన్నారు.
స్టార్టప్ గా మొదలైన తెలంగాణ రాష్ట్ర విజయప్రస్థానం అప్రతిహాతంగా కొనసాగుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 2014లో లక్షా 24 వేల రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయం కేవలం ఏడేండ్ల కాలంలోనే 130 శాతం పెరిగి, రెండు లక్షల 78 వేల రూపాయలకు చేరడం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.ఇంతేకాదు 2014 లో 5 లక్షల 60 వేలు ఉన్న రాష్ట్ర జీడీపీ, ఇవాళ 11 లక్షల 54 వేలకు చేరిందన్నారు. ఇదేదో ఆషామాషీగా చెబుతున్న విషయం కాదని, భారత ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించిందన్నారు. విస్తీర్ణంగా చూసుకుంటే దేశంలో తెలంగాణ 11 వ పెద్ద రాష్ట్రమని, జనాభాపరంగా 12 వ స్థానంలో ఉందన్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం భారత ఆర్థికవ్యవస్థలో నాలుగో స్థానం తెలంగాణదేనన్నారు.
తెలంగాణ సాధిస్తున్న నిరంతర ఆర్థిక వృద్ధి, ఇక్కడి సుస్థిర పాలన, శాంతియుత వాతావరణం ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలను ఆకర్షిస్తున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, మైక్రాన్, ఆపిల్, క్వాల్ కామ్, ఉబెర్, సేల్స్ ఫోర్స్, నోవార్టీస్లు అమెరికా ఆవల తమ అతిపెద్ద క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ను ఎంచుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ ఏడేళ్లలోనే ఇవన్నీ జరిగాయన్నారు. తెలంగాణ సాగిస్తున్న ఈ ప్రగతి ప్రయాణాన్ని తెలంగాణ ఎన్నారైలు మరింత ముందుకు తీసుకుపోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవడానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం తమతో కలిసి రావాలని కోరారు.