హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నర్సంపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేటీఆర్ సమాధానం ఇచ్చారు. సంబంధిత జిల్లా కలెక్టర్ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు కోసం భూములను గుర్తించారు. ఫుడ్ పార్క్ కోసం వరంగల్ గ్రామీణ జిల్లాలోని నర్సంపేట గ్రామంలోని సర్వే నంబర్ 813లోని ప్రభుత్వ అసైన్డ్ భూమికి సంబంధించి 46 ఎకరాల 29 గుంటల భూమిని గుర్తించామన్నారు. జిల్లా కలెక్టర్ త్వరలోనే భూసేకరణ ప్రక్రియను పూర్తి చేస్తారని తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. చిన్న నీటి వనరులను కాపాడుకుంటున్నామని చెప్పారు. రాష్ర్టంలో ఇవాళ అద్భుతంగా భూగర్భ జలాలు పెరుగుతున్నాయని స్పష్టం చేశారు. సిరిసిల్లలో 6 మీటర్లు భూగర్భ జలాలు పైకి వచ్చాయన్నారు. నీటి వనరులను పెంచుకోవడంతో.. వ్యవసాయ దిగుబడులు, ఆహార ఉత్పత్తులు ఇబ్బడిముబ్బడిగా పెరగబోతున్నాయి. ఆగ్రో ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఫుడ్ మ్యాప్ ఆఫ్ తెలంగాణను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. హార్టికల్చర్, అగ్రికల్చర్ రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఎక్కడ ఏ పరిశ్రమను ప్రోత్సహించాలి అనే అంశంపై ప్రభుత్వం పూర్తి అవగాహనతో ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.