హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం లండన్ బయల్దేరి వెళ్లింది. మే 18నుంచి 26వ తేదీవరకు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ యూకేలోని ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు, వాణిజ్యవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం 22 నుంచి 26వ తేదీ వరకు దావోస్లో నిర్వహించే ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సదస్సులో మంత్రి పాల్గొంటారు. ఈ నెల 18నుంచి 21వ తేదీవరకు నాలుగురోజులపాటు కేటీఆర్ యూకే ప్రపంచస్థాయి కంపెనీల అధిపతులతో వరుసగా భేటీ కానున్నారు. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించే రెండు రౌండ్టేబుల్ సమావేశాల్లోనూ ఆయన పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, ఇక్కడి మౌలిక సదుపాయాల గురించి వారికి వివరిస్తారు. తెలంగాణను టెక్నాలజీ పవర్హౌస్గా మార్చడంలో మంత్రి కేటీఆర్ కృషి ఎంతగానో ఉందంటూ వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షులు బోర్గ్బ్రెండే ప్రశంసించారు. ఆవిష్కరణలు, సాంకేతికతకు భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా మార్చడంలో తెలంగాణ పాత్ర ఎంతో కీలకమంటూ.. ఆహ్వాన సందేశంలో బోర్డ్బ్రెండే ప్రశంసించారు.
ఐటీయేతర రంగాలపై ప్రధాన దృష్టి
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాల్లో పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిన నేపథ్యంలో మరిన్ని అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ వైపు చూసేలా ఈ పర్యటన సాగనున్నది. ఇప్పటికే ఫార్మా, బయోసైన్స్ రంగాల్లో హైదరాబాద్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. ఈ నేపథ్యంలో ఫార్మా, ఆటోమొబైల్, ఇంజినీరింగ్ కంపెనీలను రాష్ర్టానికి రప్పించేలా పలు దిగ్గజ సంస్థలతో కేటీఆర్ చర్చలు జరుపనున్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల మూలంగా వ్యవసాయ దిగుబడులు భారీగా పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం 500 ఎకరాలకు తగ్గకుండా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే యూకే, యూరప్ దేశాల్లోని ప్రపంచస్థాయి ఆహార ఉత్పత్తులు, బేవరేజెస్ కంపెనీలను రాష్ర్టానికి ఆకర్షించేలా మంత్రి పర్యటన సాగుతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రపంచస్థాయి కంపెనీల అధిపతులతో సమావేశం
కొవిడ్ అనంతరం వివిధ దేశాలకు చెందిన వాణిజ్యవేత్తలు, వ్యాపార ప్రముఖులను ఒక వేదికపైకి తెస్తున్న నేపథ్యంలో దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు ప్రాధాన్యం ఉన్నది. ప్రపంచస్థాయి కంపెనీల అధిపతులతో, వ్యాపార ప్రముఖు లతో చర్చించడంతోపాటు వర్క్షాప్లు, వార్షిక సమావేశాల్లో తెలంగాణ ప్రతినిధి బృందం పాల్గొంటున్నది. ఈ సమావేశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన సుమారు 2000మంది నాయకులు పాల్గొంటుండగా.. పెట్టుబడుల ఆకర్షణ, పౌర-కేంద్రీకృత విధానాల ఫ్రేమ్వర్క్లో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి కేటీఆర్ వారికి వివరించనున్నారు. ప్రముఖులతో బృంద చర్చలు, ద్వైపాక్షిక సమావేశాల్లోనూ పాల్గొని తెలంగాణ వృద్ధిని వివరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 35మంది వ్యాపారవేత్తలతో ఆయన సమావేశమవుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దావోస్లో అత్యాధునిక లాంజ్ను కూడా ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల వృద్ధికి ఉన్న అవకాశాలను అక్కడ ప్రదర్శించనున్నారు.
అమెరికా పర్యటన తరహాలోనే…
ఇటీవల కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లివచ్చిన తరువాత పలు అమెరికన్ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అమెరికా పర్యటనలో భాగంగా ఎడ్వెంట్ సంస్థ ఫార్మా రంగంలో రూ.1750 కోట్లు, అలాగే న్యూజెర్సీలోని ఔషధ కంపెనీ స్లేబ్యాక్ ఫార్మా రూ.1500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. స్లేబ్యాక్ గడచిన ఐదేండ్లలో రాష్ట్రంలో రూ.2300 కోట్ల పెట్టుబడులు పెట్టగా.. వీటికి అదనంగా మరో రూ.1500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నది. తన అమెరికా పర్యటనలో సుమారు 35 సమావేశాలు జరిపిన కేటీఆర్.. రాష్ర్టానికి రూ.7500 కోట్ల పెట్టుబడులను రాబట్టడంలో విజయం సాధించారు. పలు కంపెనీలు నగరంలో పర్యటించి తమ పెట్టుబడుల ప్రకటన చేస్తామని హామీ ఇచ్చాయి. ఈ క్రమంలోనే యూకే నుంచి కూడా రాష్ర్టానికి పెద్దఎత్తున పెట్టుబడులు తరలివచ్చేలా తాజా పర్యటనను రూపొందించారు.