హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ఐటీఐఆర్ ప్రాజెక్టుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రికి రాసిన లేఖ వట్టి అబద్ధాల జాతర అని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్రంగా మండిపడ్డారు. అసత్యాలను ప్రచారంచేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నేతల నైజం మరోసారి బండి సంజయ్ లేఖ ద్వారా బయటపడిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్కు ఐటీఐఆర్ తీసుకురాలేని బీజేపీ.. రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ అభివృద్ధిని పణంగా పెట్టి ఐటీఐఆర్ను రద్దుచేసిన కేంద్రంలోని వారి సొంత ప్రభుతానికి లేఖ రాస్తే బాగుండేదని హితవుచెప్పారు. ఈ మేరకు బుధవారం మంత్రి కేటీఆర్ ఒక ప్రకటనను విడుదలచేశారు.
పార్లమెంట్ సాక్షిగా పలుమార్లు ఐటీఐఆర్ను రద్దుచేస్తున్నట్టుగా ప్రకటించిన కేంద్ర మంత్రి రవిశంకర్ప్రసాద్కు లేఖ రాసి నిజాలు తెలుసుకోవాలని బండి సంజయ్కి సూచించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచే ఐటీఐఆర్ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. వాస్తవాలు కండ్ల ముందు కనిపిస్తున్నా, కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎంతటి అబద్ధాలనైనా మాట్లాడే నైజం బీజేపీ సొంతమని ఎద్దేవాచేశారు. జూన్ 2014లో అంటే తెలంగాణ వచ్చిన మొదటి నెలలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఐటీఐఆర్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారని గుర్తుచేశారు. అదే ఏడాది సెప్టెంబర్లో పూర్తి వివరాలతో కేంద్రానికి ఒక మెమొరాండం సమర్పించామని చెప్పారు. దీంతోపాటు అనేకసార్లు ప్రధానికి, కేంద్ర ఐటీశాఖ మంత్రికి పలుమార్లు విజ్ఞప్తులు చేశామని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున తానే పలుమార్లు ఈ విజ్ఞప్తులను అందజేశానని తెలిపారు. అయినా కేంద్రంనుంచి ఉలుకుపలుకు లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి సరైన నివేదికలు లేకపోవడం వల్లనే ఐటీఐఆర్ ప్రాజెక్టు ఆగిందని అంటున్న ఎంపీ బండి సంజయ్ కండ్లుండీ నిజాలు చూడలేని గుడ్డివాడి లాంటివాడని మంత్రి కేటీఆర్ ఎద్దేవాచేశారు. వాస్తవాలను దాచిపెట్టి, నిస్సిగ్గుగా అబద్దాలు చెప్తూ హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం అంటూ బద్నాం చేయడం ‘ ఉల్టా చోర్ కోత్వల్ కో డాంటే‘ అన్నట్టు గా ఉన్నదన్నారు.
ఒక్క తెలంగాణ లోనే కాదు, ఐటీఐఆర్ మంజూరు అయిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ర్టాల్లో కూడా ఆ ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదన్న సంగతి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి అజ్ఞానానికి నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా కర్ణాటకలోనూ అధికారంలో ఉన్న బీజేపీ.. బెంగళూరు ఐటీఐఆర్ ప్రాజెక్టులో తట్టెడు మట్టికూడా తీయలేదన్న వాస్తవాన్ని తెలుసుకోవాలని పేర్కొన్నారు. బెంగళూరులో, ఏపీలో, భువనేశ్వర్లో ఐటీఐఆర్ మొదలుకాకపోవడానికి కూడా కేసీఆర్ ప్రభుత్వమే కారణమా? అని ప్రశ్నించారు. ఐటీఐఆర్ వంటి కీలకమైన ప్రాజెక్టు దేశమంతటా రద్దుకావడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ నేతలు గుర్తించాలని సూచించారు.
కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ల మంత్రి రవిశంకర్ ప్రసాద్ అనేక పర్యాయాలు ఐటీఐఆర్ ప్రాజెక్టును కొనసాగించే ఉద్దేశం లేదని బహిరంగ ప్రకటనలు చేసింది నిజం కాదా అని మంత్రి కేటీఆర్ నిలదీశారు. కండ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవాలను దాచిపెట్టి, రాష్ట్ర ప్రభుత్వం మీద అభాండాలు వేయడానికి సిగ్గు అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిష్క్రియాపరత్వం, అసమర్థత, ఐటీరంగ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఐటీఐఆర్ మూలనపడిందని, దాన్ని కప్పిపుచ్చుకొంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం చేయడం దుర్మార్గమన్నారు. ఓపక్క ఐటీఐఆర్ ఉసురు తీసి.. మరోపక్క లేఖల డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఐదేండ్ల పాలనలో ఐటీ అభివృద్ధికి ఒక్కటంటే ఒక్క కొత్త పథకాన్ని కూడా ప్రకటించకుండా.. దేశ ఐటీరంగంపై సమ్మెట పోటు వేశారని మంత్రి కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఐటీఐఆర్ వస్తే కొత్తగా కొలువులు వస్తాయని యువకులు, నిరుద్యోగులు పెట్టుకున్న కోటి ఆశలపై నీళ్లు చల్లింది కేంద్రంలోని బీజేపీ సర్కారేనన్న విషయం తెలంగాణలోని ప్రతి ఒక్క విద్యా వంతునికి తెలుసన్నారు.
బండి సంజయ్కి చేతనైతే ఐటీఐఆర్కి సంబంధించి కేంద్రం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన చేయించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. కేవలం హైదరాబాద్లో మీడియా ప్రచారం కోసం లేఖలు కాకుండా, ఐటీఐఆర్కు సంబంధించి కేంద్రంనుంచి ఒక ప్రకటన లేదా స్పష్టత ఇప్పించాలని డిమాండ్చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి రాసిన లేఖలతోపాటు ఇచ్చిన డీపీఆర్ రిపోర్టులన్నింటినీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే వెంటనే కేంద్రంతో ఐటీఐఆర్ ప్రాజెక్టు లేదా ఐటీఐఆర్ కు సమానమైన ఇతర హోదా కలిగిన ప్రాజెక్టుని హైదరాబాద్కి ప్రత్యేకంగా తీసుకురావాలని సూచించారు. అటు సొంత పార్టీని, సొంత ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేక అసత్యాలు, అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసంచేయాలని చూసే బండి సంజయ్ ప్రయత్నాలు ఎన్నడూ సఫలం కావన్నారు. ఇప్పటికైనా ఐటీఐఆర్ను రద్దుచేస్తామని ప్రకటించిన తమ సొంత పార్టీకే చెందిన కేంద్ర మంత్రి రవిశంకర్ప్రసాద్ ప్రకటనను మరోసారి చదువుకొని తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ నగర యువతకి ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దుచేసినందుకు క్షమాపణ చెప్పాలన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఐటీఐఆర్పై కనీస అవగాహనలేదని సీఎం కేసీఆర్కు ఆయన రాసిన లేఖ స్పష్టం చేస్తున్నదని తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు. బండి సంజయ్ లేఖలో పేర్కొన్న అంశాలన్నీ తొండి మాటలేనని ఐటీరంగ నిపుణులు పేర్కొంటున్నారు. బండి సంజయ్కు ఐటీఐఆర్ పూర్తి పేరు కూడా తెలిసినట్టు లేదని ఎద్దేవా చేస్తున్నారు. ముఖ్యమంత్రికి ఒక పార్టీ అధ్యక్షుడి హోదాలో రాసే లేఖ సంపూర్ణ అవగాహనతో రాయలేకపోవడం దురదృష్టమంటున్నారు. రోడ్డు దాటేందుకు పడవ ఏది అన్నట్టే బండి సంజయ్ లేఖ ఉన్నదని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కేంద్రం ఐటీఐఆర్ను ఇవ్వటంలేదని పేర్కొంటూనే కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్మఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ జనవరి 11, 2017న మౌలిక వసతుల ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించిందని ప్రస్తావించటంలో అర్థం ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి డీపీఆర్లు, ప్రతిపాదనలు వెళ్లకుండానే కేంద్రం తనంత తానుగా సమీక్షిస్తుందా? కనీస జ్ఞానం లేకుండా బండి సంజయ్ రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. 2014 నుంచి 2017 దాకా రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐఆర్పై ప్రస్తావించలేదంటున్న బండి సంజయ్కు కేంద్ర మంత్రి ఆయా సందర్భాల్లో ఐటీఐఆర్పై చేసిన ప్రకటనలు అర్థం కానట్లున్నదని ఎద్దేవాచేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి రాసిన లేఖలతోపాటు ఇచ్చిన డీపీఆర్ రిపోర్టులన్నింటినీ ఇస్తాం. దమ్ముంటే వెంటనే కేంద్రంతో ఐటీఐఆర్ ప్రాజెక్టు లేదా దానికి సమానమైన హోదా కలిగిన ప్రాజెక్టును హైదరాబాద్కు ప్రత్యేకంగా తీసుకు రావాలి. అటు సొంత పార్టీని, సొంత ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేక అసత్యాలు, అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసంచేయాలని చూసే బండి సంజయ్ ప్రయత్నాలు ఎన్నడూ సఫలం కావు.
-మంత్రి కేటీఆర్