రాజన్న సిరిసిల్ల : తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజన్న సిరిసిల్లలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా తోట ఆగయ్య ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరై ప్రసంగించారు.
గల్లీ టు ఢిల్లీ మనమే ఉన్నాం అని కేటీఆర్ తెలిపారు. అవులాగాడు, బేకూఫ్గాడు మాట్లాడితే బెదరొద్దు. ఏ నాయకుడు చేయని పని కేసీఆర్ చేసి తెలంగాణను అభివృద్ధి చేశారు. కేసీఆర్ను ఎవరైనా ఒక మాట అంటే ఊరుకునేది లేదు. జనగామ, ఆర్మూర్లో బీజేపీ నాయకులను పొట్టుపొట్టు తన్నారు. హద్దులు దాటితే తప్పకుండా బుద్ధి చెప్తాం అని బీజేపీ నేతలను కేటీఆర్ హెచ్చరించారు. సిరిసిల్ల గడ్డ మీద చైతన్యం చూపిస్తాం. ఇక నుంచి ఊకోం అని తేల్చిచెప్పారు. తెలంగాణను సాధించిన కేసీఆర్ను ఏమైనా అంటే.. పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడి వాళ్లం అక్కడ ఒక్కొక్క కార్యకర్త.. కేసీఆర్ లాగా ఫిరంగులై గర్జించాలి. తప్పకుండా విరుచుపడాలి. కేసీఆర్ తెలంగాణకు ఏం తక్కువ చేసిండు అని బీజేపీ నాయకులను నిలదీయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.