వ్యవసాయంలో వ్యయం పెరిగి.. సాయం తగ్గింది
‘శ్రీకారం’ ప్రీరిలీజ్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్
ఇండియాకే యూత్ ఐకాన్ కేటీఆర్: శర్వానంద్
కేటీఆర్ ప్రసంగాలతో ప్రేరణ పొందా: దర్శకుడు కిశోర్
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): నవతరం వ్యవసాయంపై మక్కువ పెంచుకోవాలని, రైతుల కష్టాలను గ్రహించాలని రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. వ్యవసాయం చేస్తున్న రైతులకు వ్యయం ఎక్కువైపోయి.. సాయం తక్కువైందని వ్యాఖ్యానించారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి రైతుకు సాయం చేయాలనే చక్కటి సందేశంతో తెరకెక్కిన సినిమా ‘శ్రీకారం’ అని చెప్పారు. శర్వానంద్, ప్రియాంక అరుళ్మోహన్ జంటగా నటించిన శ్రీకారం ప్రీరిలీజ్ వేడుక మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తన తండ్రి సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని అమితంగా ప్రేమించే ఓ రైతు అని చెప్పారు.
ఓ రైతు రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయితే వ్యవసాయానికి ఎంత మేలు జరుగుతుందో తెలంగాణలో చూస్తున్నామని అన్నారు. ‘ఎద్దు ఏడిస్తే ఎవుసం బాగుండదు.. రైతు ఏడిస్తే రాజ్యం బాగుండదని పెద్దలు చెప్తారు. వ్యవసాయం అనే మాటలో వ్యయం, సాయం రెండూ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యయం పెరిగిపోయి రైతు వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొంది. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంట్ అందిస్తున్నాం. పరిశ్రమలకు లోన్ ఇచ్చినట్టుగానే వ్యవసాయం చేసే రైతుకు పెట్టుబడి అందివ్వాలనే ఆలోచనతో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన మొదటి సీఎం మన కేసీఆర్. రైతులందరికి ఉచితంగా రూ.5 లక్షల రైతు బీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మాది’ అని పేర్కొన్నారు.
వ్యవసాయం గొప్పతనంతో దర్శకుడు కిశోర్ చేసిన లఘు చిత్రాన్ని సినిమాగా మలచిన నిర్మాతల ధైర్యం అభినందనీయం అని అన్నారు. ‘కిశోర్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని నమ్ముతున్నా, టీజర్ చూస్తుంటే మనసుపెట్టి సినిమా తీసిన భావన కలిగింది. గుండెను తాకుతూ ఆత్మసంతృప్తినిచ్చే మంచి సినిమాగా హీరో శర్వానంద్ కెరీర్లో మిగిలిపోవాలి అని ఆకాంక్షించారు. ఈ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చేలా ప్రయత్నిస్తానని మంత్రి కేటీఆర్ తెలిపారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్ ఇండియాకే యూత్ ఐకాన్గా నిలుస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని, రైతే రాజు అని నిరూపిస్తున్నారని చెప్పారు. అన్నంపెట్టే భూమిని ప్రేమించే యువకుడిగా తాను ఈ సినిమాలో కనిపిస్తానని చెప్పారు. చిత్ర దర్శకుడు కిశోర్ మాట్లాడుతూ.. జీవితంలో చాలా విషయాలు ప్రశ్నార్థకంగా మారిన సమయంలో కేటీఆర్ ప్రసంగాలు విని ప్రేరణ పొందానని చెప్పారు. కేటీఆర్ మాటలు, పనుల నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమా చేశానని తెలిపారు. గురువారం శ్రీకారం విడుదలవుతున్నది.