భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటికి రావద్దు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. మరో మూడు రోజులు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్నది. ఈ క్రమంలో యంత్రాంగం అంతా అందుబాటులో ఉంటూ ప్రజలకు భరోసా కల్పించాలి. ముఖ్యంగా ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుల వద్ద గస్తీ చేపట్టాలి. – కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ హెగ్డేలతో ఫోన్లో మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, జూలై 11 (నమస్తే తెలంగాణ) : ఎడతెరిపిలేని వానలు పడుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనతో సోమవారం సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డేతో మాట్లాడారు. జిల్లాలో తీసుకున్న చర్యలపై సమీక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నందున అధికారులు జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండి, ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. ప్రాజెక్టులు, చెరువులు, చెక్డ్యాంల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు, బోయినపల్లి మండలంలోని శ్రీరాజరాజేశ్వర, ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ ప్రాజెక్టుల వద్ద నిఘా ఉంచాలని, సిరిసిల్ల మానేరు, వేములవాడ మూల వాగులు, ప్రతి మండలంలోని చెరువుల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా చూడాలని సూచించారు.
రాజన్న భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కల్వర్టులు, బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండి ప్రమాదాలు జరుగకుండా చూడాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, విద్యుత్, పోలీస్, ఆరోగ్యశాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పనిచేసి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తెగిపోయిన విద్యుత్ వైర్లు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి, ప్రమాదాలు జరుగకుండా చూడాలని ఆదేశించారు.