కర్నాటక బీజేపీ అగ్రనేత, మంత్రి కే.ఎస్. ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ జెండా రాబోయే రోజుల్లో జాతీయ జెండాగా మారే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు మాత్రం త్రివర్ణ పతాకం జాతీయ జెండా అని, దానిని అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. అలా గౌరవించకపోతే దేశద్రోహమే అవుతుందని కుండబద్దలుకొట్టారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీరామచంద్రుడు, హనుమంతుడి రథాలపై కాషాయ జెండాయే రెపరెపలాడేదని గుర్తు చేశారు. అప్పుడు ఈ దేశంలో త్రివర్ణ పతాకం ఉన్నదా? అంటూ ప్రశ్నించారు.
ఇప్పుడు మాత్రం త్రివర్ణ పతాకమే మన జాతీయ జెండా అని, అందులో ఎలాంటి సందేహమూ లేదని మంత్రి ఈశ్వరప్ప అన్నారు. ఎర్రకోటపై కాషాయ జెండా ఎగురుతుందా? అని విలేకరులు ప్రశ్నించగా… ఇప్పుడు కాదు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఎగిరే అవకాశాలు మాత్రం ఉన్నాయని కుండబద్దలు కొట్టారు. ఒకప్పుడు తాము అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని అంటే.. అందరూ నవ్వే వారని, ఇప్పుడు మేం నిర్మిస్తున్నాం కదా? అని వివరించారు. ఇదే విధంగా రాబోయే 100 సంవత్సరాలకో, 200 సంవత్సరాలకో, 500 సంవత్సరాలకో కచ్చితంగా కాషాయ జెండా జాతీయ జెండాగా మారే అవకాశాలున్నాయన్నారు.