హైదరాబాద్ : జమ్మికుంట – ఉప్పల్ మధ్య రోడ్డు నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం ప్రారంభించారు. జమ్మికుంట-హూజూరాబాద్ మార్గం నుంచి మడిపల్లి పారిశ్రామిక వాడ మీదుగా రైల్వే గేట్ జమ్మికుంట-ఉప్పల్ మార్గాన్ని కలుపుతూ రోడ్డు నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరు చేయించి, పనులను ప్రారంభించారు మంత్రి కొప్పుల. లారీలు, ట్రాక్టర్లకు రవాణా సౌకర్యం, రాకపోకలు, వర్షాల కారణంగా రోడ్డు దెబ్బతింది. రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానిక పారిశ్రామికవేత్తలు శివకుమార్, రవీందర్ మంత్రికి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించి కొప్పుల అధికారులతో మాట్లాడి 24 గంటల్లోనే రూ.2కోట్లు మంజూరు చేయించారు. హమాలీలతో కొబ్బరికాయలు కొట్టించి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, కౌన్సిలర్ మల్లయ్య, టీఆర్ఎస్ యువ నాయకులు శ్రీకాంత్, అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు.