ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల కలెక్టరేట్లో వరదలపై అధికారులతో సమీక్ష
జగిత్యాల, జూలై 14 (నమస్తే తెలంగాణ): జిల్లావ్యాప్తంగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో భోజన, ఇతర మౌలిక వసతులు కల్పించాలని దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో గురువారం ఆయన వెల్గటూర్, గొల్లపల్లి మండలాల్లో పర్యటించారు. రాయికల్ మండలం రామాజీపేట్, భూపతపూర్ వాగులో రిపోర్టర్ జమీర్ గల్లంతుకాగా, గాలింపు చర్యలను పరిశీలించారు. ఆ తర్వాత వరదల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరేట్లో కలెక్టర్ గుగులోతు రవితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించడం, గణనీయంగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడం అభినందనీయమన్నారు. రాయికల్ మండలంలో గల్లంతైన ఎన్టీవీ జర్నలిస్ట్ ఆచూకీ లభించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. జిల్లావ్యాప్తంగా మరో ఐదు రోజులు వానలు పడే అవకాశం ఉన్నందునా అధికారులు నిరంతరం అలర్ట్గా ఉండాలన్నారు.
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించాలని, పూర్తి వివరాలతో నివేదించాలని సూచించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. కాగా, జిల్లాలో నీట మునిగిన ప్రాంతాలు మినహాయించి మిగిలిన చోట్ల విద్యుత్ను పునరుద్ధరించామని నీటి ప్రవాహం తగ్గిన వెంటనే ఆ ప్రాంతాలకు సైతం పునరుద్ధరిస్తామని అధికారులు చెప్పారు. చెరువుల్లో సామర్థ్యం మేరకు నీరు నిలువ ఉండేలా చర్యలు తీసుకోవాలని, కట్టలు తెగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ బీర్పూర్ మండలంలో అధిక నష్టం జరిగిందని, అకడి నుంచి 2135 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలలో హెచ్చరికల బోర్డు లు ఏర్పాటు చేయాలని, యువకులు చేప లు వేటకు వెళ్లకుండా నిరోధించాలని జడ్పీ చైర్పర్సన్ దావ వసంత అధికారుల కు సూచించారు. కలెక్టర్ రవి మా ట్లాడు తూ అధికారులు కృషి ఫలితంగా తక్కువ ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. వానల కారణంగా జిల్లాలో దాదాపు 22992 ఎకరాల్లో పంటలు, 415 ఇండ్లు పాక్షికంగా, 15 ఇండ్లు పూర్తిగా, 26 పంచాయతీరాజ్ రోడ్లు, 10 ఆర్ అండ్ బీ రోడ్లు దెబ్బతిన్నాయని కలెక్టర్ తెలిపారు. 3వేల మంది ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 2016 విద్యుత్ స్తంభాలు, 85 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయని, 75శాతం మేర విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని వెల్లడించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, అదనపు ఎస్పీ రూపేశ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆరుణశ్రీ, ఆర్డీవో తదితరులు పాల్గొన్నారు.