తిరుమల: తిరుమల (Tirumala) శ్రీవారిని మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు మంత్రి కొప్పుల దంపతులకు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ.. తిరుమలేశుడిని దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదం పొందడం తనకు ఆనవాయితీగా వస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో అనేక సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. రెండు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించేలా స్వామివారు కరుణించాలని ప్రార్థించినట్లు వెల్లడించారు.
తిరుమల శ్రీవారిని రాష్ట ప్రిన్సిపాల్ సెక్రటరీ నర్సింగ రావు, వరంగల్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ఆర్అండ్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాస రాజులు దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వారికి వేదపండితులు ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్థప్రసాదాలు, స్వామి వారి పట్టు వస్త్రాలను అందజేశారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని నర్సింగ రావు అన్నారు.