హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకులాల్లో తనిఖీల కోసం ఐదు ప్రత్యేక బృందాలను నియమించింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వర్షాకాల నేపథ్యంలో హాస్టళ్లలోని పిల్లలు వైరల్ ఫీవర్.. తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారనే ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నారు. నేటి నుంచి 5వ తేదీ వరకు ఆయా బృందాలు హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించనున్నాయి. గురుకులాల్లో తాగునీటి నిల్వ, వసతులు, వంటగది, భోజనశాల, పరిశుభ్రత, బియ్యం నాణ్యత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. 6వ తేదీ సాయంత్రానికల్లా పూర్తిస్థాయి నివేదికను అందించాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లోని హాస్టళ్ల తనిఖీకి గురుకులాల సొసైటీ సెక్రటరీ మల్లయ్యభట్టు, డిప్యూటీ డైరెక్టర్ విద్య, సెక్షన్ ఆఫీసర్ విక్రమ్రావు, సెక్షన్ ఆఫీసర్ శ్రీధర్ను నియమించారు. మహబూబ్నగర్ జిల్లాకు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సొసైటీ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్, వరంగల్, ఖమ్మం జిల్లాకు వడ్డెర కార్పొరేషన్ ఎండీ బాలాచారి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు అడిషనల్ సెక్రటరీ పద్మ నేతృత్వంలో అధికార బృందాలను నియమించారు.
కేటీఆర్ ఆదేశాలతో సిరిసిల్లలో హాస్టళ్ల తనిఖీలు
ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ గురుకులాలు, హాస్టళ్లను అధికారులు తనిఖీ చేశారు. జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తాసిల్దార్లు, హాస్టళ్లకు సంబంధించిన ప్రత్యేక అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. హాస్టల్ వంటగది, స్టోర్రూమ్, టాయిలెట్లను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం వార్డెన్ నాణ్యమైన, రుచికరమైన భోజనం వడ్డిస్తున్నారా? లేదా? అని ఆరా తీశారు. వంటకు వినియోగిస్తున్న నీటిని పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని గురుకులాలు, వసతి గృహాల నిర్వాహకులను అధికారులు ఆదేశించారు. ఈ తనిఖీలు మంగళవారం కూడా కొనసాగించి సాయంత్రంలోగా జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేయనున్నారు.
బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు స్పీకర్ పరామర్శ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో కరోనా బారిన పడ్డ పలువురు విద్యార్థినులను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సోమవారం పరామర్శించారు.
హుస్నాబాద్ మైనార్టీ బాలికల గురుకులంలో కరోనా కలకలం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నలుగురు విద్యార్థినులకు కరోనా పరీక్షలు చేయగా, ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన వైద్యు లు.. పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
నందిమేడారం గురుకులంలో మంత్రి కొప్పుల తనిఖీలు
ధర్మారం, ఆగస్టు 1: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నందిమేడారం గురుకుల పాఠశాలను ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలువురు విద్యార్థులు జ్వరాల బారిన పడ్డారని స్థానిక నేతల ద్వారా తెలుసుకొన్న మంత్రి స్కూల్ను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్యపరిస్థితిపై వాకబు చేశారు.