ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు అందాలని ఆశించిన వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అందరివాడని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు.
అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
రాజ్యాంగాన్ని ఇప్పటికీ చాలా మంది అర్దం చేసుకోవడం లేదన్నారు. అంబేద్కర్ అంటే దళితులకు మాత్రమే రిజర్వేషన్లు తెచ్చాడని నమ్మేవారే ఎక్కువన్నారు. అంబేద్కర్ దేశ ప్రజలందరికోసం రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు.
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమల్లోకి వస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇన్నేళ్లు గడిచినా ఎస్సీల అభివృద్ది అక్కడే ఉందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో మూడు రోజుల క్రితం ఎస్సీ వర్గానికి చెందిన పెళ్లి కొడుకు గుర్రం ఎక్కినందుకు రాళ్లతో కొట్టిన నాయకులెవరో ప్రజలు గమనించాలన్నారు. దేశంలోని ఏ రాష్ట్రాల్లో మతతత్వ పార్టీలు దళితులను తొక్కేసే కుట్ర చేస్తున్నాయో ప్రతిఒక్కరూ తెలుసుకోవాలన్నారు.
తెలంగాణలో దళితుల తలరాతలు మార్చేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు అనే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ ఏడాది 2 లక్షల 40 వేల కుటుంబాలకు దళిత బంధు రానుందని వెల్లడించారు. దళితుల అభ్యున్నతికోసం ఆలోచిస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. దళితబంధు పథకం దేశమంతా అమలుకావాలని మంత్రి కొప్పుల కోరారు.