అమరావతి : ఏపీ వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తామని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడిన ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ను టీడీపీ నేత పట్టాభి చాలా అవమాన పరిచారన్నారు. పట్టాభి కూడా డబ్బులు తీసుకొని తిడుతున్నాడన్నారు. జగన్ ఇప్పటి వరకు ఎవర్నీ తిట్టలేదని, రోజుకో ప్రెస్మీట్ లేకపోతే చంద్రబాబుకు నిద్రపట్టదని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ను రెచ్చగొట్టాలన్నదే టీడీపీ ప్లాన్ అని ఆరోపించారు.
చంద్రబాబులాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా ఏం కాదని, సీఎంను ఇంచు కూడా చంద్రబాబు కదపలేరన్నారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు టీడీపీ సృష్టిస్తోందని విమర్శించారు. చంద్రబాబులా పెయిడ్ ఆర్టిస్ట్లను పెట్టి తిట్టించడం తమకు రాదన్నారు. వ్యూహం ప్రకారమే డ్రగ్స్ ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్షాపై తిరుపతిలో చంద్రబాబు రాళ్లతో దాడి చేయించారని.. చంద్రబాబు ఎలాంటి వ్యక్తో అమిత్షా, మోదీలకు తెలియదా? అన్నారు.
ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని అమిత్షాను కలుస్తావని ప్రశ్నించారు. చంద్రబాబు చేసేవన్నీ నీచ రాజకీయాలేనని, ఆయన చేసే కొంగ జపాలను ఎవరూ నమ్మరని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని రాజకీయాలకు దూరం చేశారని, వైఎస్సార్ను కూడా బాబు ఎన్నో ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. వైఎస్ జగన్పై మొదటి నుంచి అనేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. పోసాని ఇంటిపై దాడి జరిగితే పవన్ కల్యాణ్.. టీడీపీ ఆఫీస్లో రెండు కుర్చీలు విరగ్గానే ప్రజాస్వామ్యం ఖూనీ అంటున్నారని విమర్శించారు.