పల్నాడు: వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిచే సత్తా మనకున్నదని, ఆ దిశగా మనమంతా పనిచేయాలని పల్నాడు జిల్లా ఇంఛార్జీ మంత్రి కారుమూరు నాగేశ్వర్రావు సూచించారు. ప్రజా ప్రభంజనం పల్నాడు జిల్లా నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. నరసరావుపేట పట్టణంలోని వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ప్లీనరీ నిర్వహించారు. ముందుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలు వేసి నివాళి అర్పించి, జ్యోతి ప్రజ్వలన గావించారు.
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి 175 సీట్లు గెలిచేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. ఎల్లో మీడియా దుష్ప్రచారాలను తిప్పికొడ్తూ సంక్షేమ రాజ్యం మరోసారి తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరం పనిచేద్దామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. టీడీపీ కరుడుగట్టిన అభిమానులు సైతం ఈసారి వైసీపీకి ఓటువేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికే నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్లీనరీలు విజయవంతంగా పూర్తిచేశామని, 8, 9వ తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి ప్లీనరీకి పల్నాడు నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.
ఈ సమావేశంలో మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, జంగా కృష్ణమూర్తి, నంబూరు శంకర్రావు,బొల్లా బ్రహ్మనాయుడు తదితరులు హాజరై ప్రసంగించారు.