నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోరుబావులకు విద్యుత్ మీటర్లు బిగింపుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కొత్త భాష్యం చెప్పారు. లోడ్ అంచనా వేసేందుకే బోర్లకు మీటర్లు బిగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం జవాబుదారీతనం కోసం ఈ మీటర్లు బిగిస్తున్నదని కూడా చెప్పడం విశేషం. వ్యవసాయ కనెక్షన్లు తొలగించమని, ఈ బోర్ మీటర్లకు వచ్చే బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి కాకాణి ఈ వ్యాఖ్యలు చేశారు.
వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్ల బిగింపుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను మంత్రి కాకాణి తోసిపుచ్చారు. ప్రభుత్వం జవాబుదారీతనం కోసమే ఈ మీటర్లు బిగించి రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం భవిష్యత్లో ఆదుకోవడానికి లోడ్ అంచనా వేస్తున్నదన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఎంత లోడ్ అవసరమో, ఎంత మంది రైతులు 9 గంటల ఉచిత పగటిపూట విద్యుత్ సరఫరా పొందుతున్నారో ప్రభుత్వం అంచనా వేసేందుకే ఈ మీటర్ల ఏర్పాటు అని స్పష్టం చేశారు. వ్యవసాయ కనెక్షన్లు డిస్కనెక్ట్ చేయబోమని స్పష్టం చేశారు. ఈ మీటర్లకు బిల్లులు రాగానే ఆ మొత్తాన్ని డిస్కమ్లకు ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. అయితే, రైతుల్లో గందరగోళం సృష్టించడం ద్వారా టీడీపీ నేతలు ఈ రొటీన్ అసెస్మెంట్ విధానాలను క్లిష్టతరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం చెల్లించకుండా మిగిలిపోయిన రూ.9,000 కోట్ల విద్యుత్ బకాయిలను తమ ప్రభుత్వం క్లియర్ చేసిందని ఈ సందర్భంగా కాకాణి గుర్తుచేశారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ను వైసీపీ సర్కార్ అందించడం ప్రారంభించిందని, అదనంగా రూ.1,700 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రైతులు పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ను అందుకుంటున్నారని, అయినప్పటికీ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.