హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యధిక స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు గెలుచుకొన్న రాష్ర్టాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచినందుకు గర్వంగా ఉన్నదని రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అర్బన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మొత్తం 16 అవార్డులను తెలంగాణ అందుకొన్నది. అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి కౌషల్ కిశోర్, కార్యదర్శి మనోజ్జోషి, సంయుక్త కార్యదర్శి రూపా మిశ్రా అందజేయగా.. తెలంగాణ తరఫున మంత్రి కేటీఆర్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, ఆయా మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు స్వీకరించారు. ఈ సందర్భంగా అవార్డులు గెలుచుకొన్న పట్టణాల ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు, సిబ్బందిని మంత్రి కేటీఆర్ అభినందించారు.
పట్టణ స్థానిక సంస్థలను జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు మార్గనిర్దేశం చేసి స్ఫూర్తిదాయకమైన ప్రోత్సాహం అందించిన మంత్రి కేటీఆర్కు 142 పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల తరఫున మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ మొత్తం 19 అవార్డులను అందుకొన్నదని, ఇందులో స్వచ్ఛ సర్వేక్షణ్లో 16, ఐఎస్ఎల్లో మూడు అవార్డులు ఉన్నాయని శనివారం ఆయన ట్వీట్ చేశారు.