రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం లోక్సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానంతో సహా పలు విధానాలు అత్యంత లోపభూయిష్టమైనవని మండిపడ్డారు. చైనాను, పాక్ను వేరుచేయడం భారత్ వ్యూహాత్మక లక్ష్యంగా వుండాలని, కానీ మోదీ ఆ రెండు దేశాలను కలిపేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘చైనా, పాక్ను దగ్గర చేశామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో చరిత్రను తెలుసుకోవాలి. 1963 లో పాకిస్తాన్ అక్రమంగా షక్స్గామ్ లోయను చైనాకు అప్పగించింది. ఇక చైనా 1970 లో పీవోకే ద్వారా కారాకోరం హైవేను నిర్మించింది. 1970 నుంచే ఆ రెండు దేశాల మధ్య అణ్వస్త్ర సంబంధాలున్నాయి. 2013 లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను ప్రారంభించారు. వీటన్నింటినీ చూసి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి’ అంటూ కేంద్ర మంత్రి జైశంకర్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు.