నల్లగొండ : సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పర్వదినం పెట్టింది పేరు అని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం ఎంగిలిపూలతో మొదలయ్యే బతుకమ్మ ఉత్సవాలతో పాటు దేవి శరన్నవరాత్రోత్సావాలు ఘనంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే బతుకమ్మ తెలంగాణా ఉద్యమంతో ఖండాంతరాలకు విస్తరించిందని ఆయన చెప్పుకొచ్చారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ ప్రాశస్త్యాన్ని ఉద్యమ సమయంలో ముందుకు తేవడమేనని ఆయన కొనియాడారు.
తెలంగాణలో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే మొట్టమొదటి సారిగా బతుకమ్మ పర్వదినాన్ని అధికారికంగా జరుపుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరెల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. మహిళల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న ఆదరాభిమానాలకు ఇది చక్కటి ఉదాహరణగా ఆయన చెప్పారు. అందులో భాగంగానే ఈ బతుకమ్మ పర్వదినోత్సవ సందర్భంగా కోటి మంది ఆడ పడుచులకు రూ.350 కోట్లతో బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేసినట్లు మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించారు.