చౌటుప్పల్, ఆగస్టు16 : అహింసా అనే ఆయుధంతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన ధీశాలి జాతిపిత మహాత్మా గాంధీ అని, ఆయన కలలు సాకారం చేస్తూ నాటి స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలను మూడో తరానికి తెలియజేందుకు వజ్రోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. చౌటుప్పల్ పట్టణం బస్టాండ్ కూడలిలో మంగళవారం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు. బారిస్టర్ చదివేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన మహాత్మాగాంధీ అక్కడ వర్ణ వివక్షను ఎదుర్కొన్నాడని, తాను పడ్డ బాధలు దేశప్రజలు పడొద్దనే అహింసా మార్గం ద్వారా స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపారని గుర్తుచేశారు.
సాయుధ పోరాటంలో ఎంతో మంది స్వాతంత్య్ర యోధులు బలైపోవడం చూసి ఆయన చలించిపోయారని, అందుకే అహింసా మార్గాన్ని ఎంచుకొని పోరాటం కొనసాగించారని తెలిపారు. విభిన్న మతాలు, ఆచారాలను ఏకం చేసి తెచ్చిన స్వాతంత్య్రం ఫలితమే నేడు మనం అనుభవిస్తున్నామని చెప్పారు. 780 సంస్థాలను విలీనం చేసి, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టి దేశానికి స్వాతంత్య్రాన్ని గాంధీజీ తీసుకొచ్చారని చెప్పారు. అలాంటి గొప్ప పోరాట యోధుడైన గాంధీజీని అగౌరవ పరిచేలా కొన్ని దుష్టశక్తులు పయత్నిస్తున్నాయని, వీటికి చరమగీతం పాడి స్వాతంత్య్ర సంగ్రామాన్ని నేటి తరానికి అందించాలనే సంకల్పంతో వజ్రోత్సవానికి సీఎం శ్రీకారం చుట్టారని తెలిపారు.
ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో దేశభక్తి మరింత పెంపొందుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ పమేలాసత్పతి, ఇన్చార్జి డీసీపీ యాదగిరి, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, ఆర్డీఓ ఎస్.సూరజ్కుమార్, సంస్థాన్నారాయణపురం ఎంపీపీ, జడ్పీటీసీలు గుత్తా ఉమ, వీరమళ్ల భానుమతి, కౌన్సిలర్లు, ఎంపీటీసీ, విద్యార్థులు పాల్గొన్నారు.