హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించాం అని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా విద్యుత్ శాఖ పద్దులపై మంత్రి జగదీశ్ రెడ్డి వివరణ ఇచ్చారు. తెలంగాణ రాష్ర్ట తలసరి విద్యుత్ వినియోగం 2071 యూనిట్లు అని తెలిపారు. దేశ సగటు 1208 యూనిట్లు. దేశ సగటు కంటే 71 శాతం అధికంగా తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం జరుగుతుందన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థలు దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నాయి.
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ర్టంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం 355 సబ్స్టేషన్లు, 33 11 కేవీ సబ్స్టేషన్లు 3093, 7 లక్షల 62 వేల ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ను గంటల్లోపే చేసి.. అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. పాతబస్తీలో విద్యుత్ పనులకు రూ. 380 కోట్లు వెచ్చించామని పేర్కొన్నారు. రాష్ర్టంలో ఏ నియోజకవర్గంలో సమస్యలున్నా పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ర్టంలో విద్యుత్ కోతల్లేవ్. విద్యుత్ రంగంలో ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. లైన్మెన్ స్థాయి నుంచి సీఎండీల వరకు చేసిన కృషి కారణంగానే విద్యుత్ రంగంలో అనేక విజయాలు సాధించామని మంత్రి స్పష్టం చేశారు.