‘మునుగోడులో ప్రస్తుత పరిణామాలపై జిల్లా, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు వివరించడంతోపాటు దేశంలో మోదీ సర్కార్ ప్రమాదకర విధానాలను ఎండగట్టేందుకే ప్రజా దీవెన సభను ఏర్పాటు చేశాం. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అందుకు అనుగుణంగా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సభ ద్వారా మునుగోడు ప్రగతి, అభివృద్ధి పేరుతో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేస్తున్న డ్రామాలు, దాని వెనుక ఉన్న వ్యాపార ప్రయోజనాలు, ఇలా అనేక అంశాలపై ప్రజలను చైతన్యం చేస్తాం’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 20న మునుగోడులో ప్రజా దీవెన సభ నిర్వహించనున్న నేపథ్యంలో సభా స్థలం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి జగదీశ్రెడ్డి పలు విషయాలను వెల్లడించారు.
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు17(నమస్తే తెలంగాణ) :
నమస్తే : ప్రజాదీవెన సభ ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయి?
మంత్రి : మునుగోడు ప్రజాదీవెన సభకు సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. అందుకు అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం. సభపై క్షేత్రస్థాయి వరకు ప్రచారం జరుగుతున్నది. దీంతో ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు సంకేతాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా సభాస్థలం, పార్కింగ్, వేదిక, గ్యాలరీలు ఇలా అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
నమస్తే : సభ ప్రధాన ఉద్దేశం
మంత్రి : మునుగోడు నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు కారణాలేంటి? అసలు మునుగోడు ఎమ్మెల్యే ఎందుకు రాజీనామా చేశాడు? రాజీనామా వెనుక ఉన్న వాస్తవాలు ఏంటి? ఎవరి స్వార్థం కోసం ఉప ఎన్నికలు రాబోతున్నాయి? వాస్తవంగా మునుగోడు ప్రజలు, తెలంగాణ ప్రజలకు ఏమి కావాలి.. ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితులు, దేశానికి ఏ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉంది.. ఇలాంటి అనేక విషయాలపై ప్రజలను చైతన్యం చేసేందుకే సీఎం కేసీఆర్ సభకు వస్తున్నారు. ఇందులో మోదీ సర్కార్ విధానాలు, వాటి పర్యవసానాలు, దేశానికి జరుగుతున్న నష్టం తదితర అన్ని విషయాలను కేసీఆర్ ప్రజలకు వివరిస్తారు.
నమస్తే : మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా అంటున్న మాటలపై ఎలా స్పందిస్తారు?
మంత్రి : అభివృద్ధి అనే పదం ఒక్కటి మాత్రం వాస్తవం. కాకపోతే అది నియోజకవర్గ అభివృద్ధి కాదు… ఆయన కుటుంబం, వ్యాపారాభివృద్ధి. అందుకోసమే రాజీనామా డ్రామా. ఇది ప్రజలందరికీ అర్థమైంది. ఈ మూడున్నరేండ్లల్లో ప్రభుత్వం నుంచి వచ్చిన అభివృద్ధి నిధులను వాడుకునే ప్రయత్నం చేయలేదు. వచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించలేదు. కల్యాణ లక్ష్మి చెక్కుల లాంటి పంపిణీని కూడా పట్టించుకోలేదు. నియోజకవర్గం పట్ల ఇంతటి నిర్లక్ష్యపు ఎమ్మెల్యే రాష్ట్రంలోనే ఎవ్వరూ లేరనుకుంటా.
నమస్తే : మునుగోడు ప్రజలకు సభ ద్వారా ఏం సందేశం ఇవ్వనున్నారు?
మంత్రి : సమైక్య రాష్ట్రంలో మునుగోడు వెనుకబాటుకు గురైతే… స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత టీఆర్ఎస్దే. ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టి రక్షిత మంచినీళ్లు ఇచ్చి కేసీఆర్ జనాన్ని నిలబెట్టారు. కరువుకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు చర్లగూడెం రిజర్వాయర్ నిర్మాణం జరుగుతున్నది. ప్రధాన రహదారుల విస్తరణ, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన లాంటి వాటితో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. అప్పటికీ ఇప్పటికీ స్పష్టమైన తేడాను ప్రజలు స్వయంగా గుర్తిస్తున్నారు. ప్రజల్లో మరింత భరోసానింపేందుకే మునుగోడు సభ. మునుగోడు అభివృద్ధిపై తప్పుడు మాటలు మాట్లాడే వారికి సమాధానం చెప్తాం. వాస్తవాలు వివరిస్తాం.
నమస్తే : ఉప ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉండబోతున్నాయి?
మంత్రి : వాస్తవంగా ఉప ఎన్నికకు ఇంకా సమయం ఉంది. ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్దే ఇక్కడ విజయం. రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడక తప్పదు. క్షేత్రస్థాయి వరకు పటిష్టమైన పార్టీ యంత్రాంగంతోపాటు ప్రజల్లోనూ టీఆర్ఎస్కు మంచి ఆదరణ ఉంది. మునుగోడు అభివృద్ధి కోసం టీఆర్ఎస్ను గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నారు.
నమస్తే : అభివృద్ధి పేరుతో రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
మంత్రి : నిజంగా ఉప ఎన్నికతో అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే అదే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్రెడ్డి ఎందుకు పోటీ చేయడం లేదు. దీన్ని అడ్డం పెట్టుకుని బీజేపీలో చేరడంలోనే అసలు ఆంతర్యం దాగి ఉంది. కోమటిరెడ్డి సోదరులకు మొదటి నుంచి కూడా తమ వ్యాపారాల కోసం రాజకీయాలను వాడుకోవడం అలవాటు. కాంట్రాక్టులు ఎవరూ ఇస్తే వారితోనే ఉంటారు. గతంలో కాంగ్రెస్లో చేరి కాంట్రాక్టులు పొందారు. కాంగ్రెస్లో చేరిన నాడే సమైక్య రాష్ట్రంలో కాంట్రాక్టుల కోసం తెలంగాణ నీటి హక్కులను వైఎస్ఆర్కు తాకట్టుపెట్టిన ద్రోహాలు వీరు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదని, అధికారంలో ఉన్న బీజేపీతో కాంట్రాక్టులు పొందవచ్చని రాజగోపాల్ పార్టీ మారుతున్నాడు. తన కాంట్రాక్టుల కోసం మునుగోడు ప్రజల విశ్వాసాన్ని, పెంచి పెద్ద చేసిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసేందుకు సిద్ధపడ్డారు.