సూర్యాపేట : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రాష్ర్ట విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ఓ పగటి వేషగాడని, అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నాడని విమర్శించారు. రాష్ర్టంలో ప్రతిపక్షాల పరిస్థితి ఉట్టికి ఎగరలేనమ్మ.. ఆకాశానికి ఎగిరినట్టు ఉందన్నారు. తెలంగాణ ప్రజలందరూ సీఎం కేసీఆర్కు అండగా ఉంటున్నారు. తెలంగాణ ప్రజల గురించి ప్రతిపక్షాలు పట్టించుకోకుండా.. ఆంధ్రాకు లాభం చేసే వ్యవహరించాయని ధ్వజమెత్తారు. రాష్ర్ట ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ప్రతిపక్షాలు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు.
ఏపీ సర్కార్ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు సీఎం జగన్ మోదీకి లేఖలు రాస్తున్నారు. ఏపీ సీఎం జగన్ కేంద్రానికి లేఖలు రాయడం దొంగే దొంగ దొంగ అన్నట్లు గా ఉంది. జలదోపిడి చేస్తూ నీతులు మాట్లాడుతున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీటిని తొడుకు పోతున్నారు. జగన్ ప్రభుత్వం 203 జీవోను వెనక్కి తీసుకొని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలని మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు ఎలాంటి నష్టం కానివ్వరు అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.