సూర్యాపేట : కొన్ని రాజకీయ పార్టీల నేతలు స్టంట్ మాస్టర్లలా వ్యవహరిస్తున్నారని, వారి స్టంట్లన్నీ కెమెరాలకే పరిమితం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఎద్దెవా చేశారు. అలాంటి నాయకులతో తెలంగాణ ప్రజలు నడిచేందుకు సిద్ధంగా లేరని మంత్రి స్పష్టం చేశారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను వదులుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదని తేల్చిచెప్పారు. కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ముందు వెనుక ఆలోచించుకొని మాట్లాడాలని సూచించారు. ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఏమి చేశారు అన్నది ఇక్కడి ప్రజలకు స్పష్టంగా తెలుసు అని ఆయన తెలిపారు. అసలు ఈ రోజున అవాకులు చవాకులు పేలుతున్న వారికి వచ్చిన పదవులు ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన భిక్షనే అని మంత్రి అన్నారు.
తెలంగాణ అనే పదమే లేకపోతే.. వారికి ఈ పదవులు దక్కేవా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. పైరవీలతో పదవులు రావొచ్చు.. కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతాం.. ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతాం అంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. సందర్భం వచ్చినప్పుడు కారుకాల్చి వాత పెట్టడంలో తెలంగాణ సమాజం ముందుంటుందన్నారు. ప్రజాసేవే చేయాలని తాపత్రయపడుతున్న వారు ముందుగా ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చేయాలి అని జగదీశ్ రెడ్డి సూచించారు.