సూర్యాపేట : ఎన్నికల వరకే రాజకీయ నినాదం. ఆ తర్వాత మొత్తం అభివృద్ధి నినాదం అని నమ్మిన మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవలే సూర్యాపేటకు చెందిన సీనియర్ దళిత కాంగ్రెస్ నాయకుడు పందిరి వెంకన్న బ్రెయిన్ ట్యూమర్తో ఇబ్బంది పడుతూ దవాఖానలో చేరాడు. స్థానిక నాయకులు వెంకన్న ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిని మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన మంత్రి వైద్యులతో మాట్లాడి రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించారు. దవాఖాన నుంచి మంగళవారం డిశ్చార్జి అయిన పందిరి వెంకన్నను మంత్రి జగదీష్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నాను అంటే అది మీ చలవే అని, జీవితాంతం మిమ్మల్ని మర్చిపోలేనని కృతజ్ఞతలు తెలిపారు.
ఎదుటి వారిని కూడా ఆదరించే గొప్ప మనసున్న ఎమ్మెల్యే దొరకడం సూర్యాపేట ప్రజల అదృష్టమని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, నాయకులు ఉప్పల ఆనంద్, ఆకుల లవకుశ, కుంభం రాజేందర్, గోనె అశోక్, రవి, సిగ సత్యం, తదితరులు పాల్గొన్నారు.