నల్లగొండ : పోటీ ప్రపంచంలో యువతకు ఆకాశమే హద్దు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధి అంటే ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే అన్న నానుడి నుంచి యువత బయటకు రావాలని సూచించారు. పోలీస్ ఉద్యోగాల కోసం నల్లగొండ జిల్లా పోలీస్ యంత్రాంగం నల్లగొండలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో 60 రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణా తరగతులు గురువారంతో ముగిశాయి. 60 రోజులుగా సాగిన ఈ శిక్షణా తరగతులలో 227 మంది అమ్మాయిలు, 137 మంది అబ్బాయిలు శిక్షణ పొందారు.
శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ జీవితానికి కొలమానం నిస్సందేహంగా చదువే అన్నారు. దానికి పదునుపెట్టి ప్రతిభను వెలికి తీస్తే అద్భుతాలు సృష్టింవచ్చన్నారు. రాష్ట్రంలో ప్రతిభావంతులకు మెరుగైన అవకాశాలను సీఎం కేసీఆర్ కల్పిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల రంగం నుంచి నిర్మాణ రంగం వరకు తెలంగాణా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఇక్కడి వారికి మాత్రమే కాకండా అంతర్రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి సుమారు 20లక్షలపై చీలుకు ఉపాధి రంగంలో స్థిరపడిపోయారన్నారు.
అపరకుబేరులందరు ప్రత్యమ్నాయా ఉపాధితోటే రాణించారన్నారు. చదువుకున్న చదువుకు తగిన రీతిలో ఉద్యోగం కోసం ప్రయత్నించడంలో తప్పు లేదని, అదే సమయంలో ఉపాధి అంటే సర్కార్ కొలువు అనే లక్షణరేఖను గీసుకోవద్దని ఆయన చెప్పారు. ప్రత్యమ్నాయంగా ఉన్న ఉపాధి రంగాల్లో స్థిరపడి ప్రతిభను చాటుకున్న రోజునే కలలు సాకారం అవుతాయన్నారు. కార్యక్రమంలో నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ రేమా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.