హైదరాబాద్, సెప్టెంబర్ 21 : భారత స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ రైతాంగ పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా అరణ్య భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ తొలితరం పోరాటయోధుడని, ఆఖరి శ్వాస వరకు తెలంగాణకై పారాడిన కొండా లక్షణ్ బాపూజీ స్మరించుకోవడమంటే తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడమేనని అన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత గొప్ప నాయకులను, గొప్ప వ్యక్తులను వారి త్యాగాలను స్మరించుకోవాలని, వారి జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా మారుమూల గ్రామంలో జన్మించి, పీడిత ప్రజల విముక్తి కోసం బహుముఖ పోరాటం చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరం యువతకు ఆదర్శమన్నారు.