సిద్దిపేట : తొలిదశ ఉద్యమంలో మంత్రి పదవికి కొండా లక్ష్మణ్ బాపూజీ రాజీనామా చేస్తే.. మలిదశ ఉద్యమంలో మంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలపొద్దని వ్యతిరేకించిన మహానీయుడు దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపుజీ అన్నారు.
ఆదివారం పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని సుడా పార్కులో నెలకొల్పిన కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. బాపూజీ త్యాగాలు భవిష్యత్ తరాలకు తెలియాలి. విలువలకు కట్టుబడిన వ్యక్తిగా జీవితాంతం అదే విలువలతో బతికారని ఆయన సేవలను కొనియాడారు.
మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమనేత కేసీఆర్ కు కొండా లక్ష్మణ్ అండగా ఉన్నారనే విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. పద్మశాలీ సంఘం వర్గాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్తో మాట్లాడి బీమా వయస్సు సడలింపు గురించి ఆలోచన చేస్తామన్నారు.
కాంగ్రెస్ హయాంలో హ్యాండ్లూమ్ బోర్డును ఏర్పాటు చేస్తే.. ఇవాళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని, చేనేత రంగానికి ఇది పెద్ద దెబ్బగా మారిందన్నారు. హ్యాండిక్రాఫ్ట్ బోర్డ్, పవర్ లూమ్ బోర్డ్, ఎనిమిది పరిశోధన సంస్థలను కూడా కేంద్రం రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం చేనేత కార్మికుల అన్ని రకాల అప్పులు మాఫీచేసి నేతన్నలకు అండగా నిలిచిందని మంత్రి వెల్లడించారు. అలాగే హుస్నాబాద్ చేనేత కార్మికులకు కూడా ఎమ్మెల్యే సతీష్ తో మాట్లాడి భవనం ఏర్పాటు కోసం కృషి చేస్తానని హామీనిచ్చారు.
సిద్దిపేట నియోజకవర్గ చేనేత కార్మికులకు సైతం అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు రమణ, ఫారూఖ్ హుస్సేన్, సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల ఉన్నారు.