నిరంతర కరెంటు ఇస్తున్నది తెలంగాణ ఒక్కటే
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
మెదక్, ఫిబ్రవరి 24: కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలే తప్ప రైతులకు చేసిందేమి లేదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. టీఆర్ఎస్ హయాంలో కనురెప్పపాటు విద్యుత్తు కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. బుధవారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో సీఎం కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్, చిన్నశంకరంపేటలో రూ.12.38 కోట్లతో 132/33కేవీ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం, పాపన్నపేట మండలం చిత్రీయాల్, గాజులగూడెం గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం, మెదక్ పట్టణంలో రూ.3.85కోట్లతో 33/11కేవీ సబ్స్టేషన్, ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. రైతులకు నిరంతర విద్యుత్తును ఉచితంగా ఇచ్చే రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఏ రాష్ర్టానికైనా వెళ్దాం.. ఎక్కడైనా ఉచితంగా రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఆరేండ్లలో 33/11 కేవీ సబ్ స్టేషన్లను వెయ్యి నిర్మించామన్నారు. అత్యధికంగా తలసరి విద్యుత్ వినియోగిస్తున్నది కూడా ఒక్క తెలంగాణేనని పేర్కొన్నారు. 70 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో గ్రామాలను విడిచి ప్రజలు వలసలు వెళ్లారని, టీఆర్ఎస్ హయాంలో ప్రజలు ఊళ్లకు తిరిగి వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా నీటి తీరువా రద్దు చేశారా?, 24 గంటల ఉచిత విద్యుత్తు, ఎకరానికి రూ.పదివేలు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలనే కేంద్రం కాపీ కొడుతున్నదని, మన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
మాస్టరుగా మారిన మంత్రి హరీశ్రావు
పాపన్నపేట మండలం కొత్తపల్లి జెడ్పీ పాఠశాలలో మంత్రి హరీశ్రావు కొద్దిసేపు మాస్టర్ అవతారమెత్తారు. తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించారు. ఓ విద్యార్థితో మాట్లాడుతూ.. డాక్టర్ కావాలంటే ఏం చదవాలి?, డాక్టర్ అయితే అమెరికా వెళ్తావా?.. ఇక్కడే ప్రజలకు సేవ చేస్తా వా? అని అడిగి తెలుసుకున్నారు.