50వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్
ఉద్యోగుల అనుభవం సర్కారుకు అవసరం
కొన్ని రాష్ర్టాల్లో 62 ఏండ్లకు రిటైర్మెంట్
అందరితో చర్చించే ఈ కీలక నిర్ణయం
బిల్లును ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్
ఏకగ్రీవంగా ఆమోదించిన శాసనసభ
సుమారు 36వేల మందికి ప్రయోజనం
ఎన్నికల హామీ నెరవేర్చిన సీఎం కేసీఆర్
కేసీఆర్ అంటే మాట.. మాటంటే కేసీఆర్..కేసీఆర్ అంటే నిలబెట్టుకొనే మాట..ఇది ఇప్పుడు మరోసారి రుజువైంది.. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచుతామన్న హామీని నిజం చేసి చూపారు ముఖ్యమంత్రి కేసీఆర్. రిటైర్మెంట్ వయో పరిమితిని మూడు రోజుల్లో పెంచుతూ చట్టం తెస్తానని చెప్పి.. చెప్పినట్టే మూడే మూడు రోజుల్లో అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింప చేశారు. నేడు మండలిలోనూ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. అక్కడ ఆమోదం పొందడం లాంఛనమే. తర్వాత రెండుమూడు రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. దీంతో ఈ నెలలో రిటైర్ కావాల్సిన ఉద్యోగులకు కూడా మూడేండ్లపాటు సర్వీసు పెరుగనున్నది. దాదాపు 36వేల మంది ఉద్యోగుల ఇండ్లల్లో కొత్త సంతోషాలు వికసించనున్నాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో తలపండినవారి అనుభవసారం.. మరికొన్నాళ్లపాటు ప్రజలకు అందనున్నది.
హైదరాబాద్, మార్చి 25, (నమస్తే తెలంగాణ): పరిపాలనలో అనుభవం గడించిన ఉద్యోగుల సేవలను వినియోగించుకొనేందుకుగాను వారి పదవీ విరమణ వయస్సును 61కి పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అసెంబ్లీ ఆమోదం లభించింది. దీంతో సుమారు 36వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. అసెంబ్లీలో గురువారం సీఎం కేసీఆర్ తరఫున పలు బిల్లులను ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు.. పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచే బిల్లును సభ ముందుకు తెచ్చామని చెప్పారు. ఈ మధ్య కాలంలో ఉత్తమ వైద్య విధానాలు, మంచి పౌష్టికాహారం తీసుకోవడంతో జీవన ఆయు ప్రమాణం పెరుగుతున్నదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల వయస్సు పెరిగే కొద్దీ వారి అనుభవం పెరుగుతుందని, ఆ అనుభవాన్ని ప్రభుత్వం మరింత వినియోగించుకొనేలా వారి పదవీ విరమణ వయస్సు పెంచుతున్నామని తెలిపారు.
కొన్ని రాష్ర్టాల్లో ఉద్యోగులు 62 ఏండ్లకు రిటైర్మెంట్ తీసుకుంటున్నారని గుర్తుచేశారు. పీఆర్సీ కమిషన్ నివేదిక, వివిధ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని పదవీ విరమణ వయస్సు 61 ఏండ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పా రు. ఈ ప్రభావం ఖాళీల భర్తీపై పడకుండా వెంటవెంటనే పదోన్నతులు చేపడుతూ కిందిస్థాయి ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు హరీశ్రావు వెల్లడించారు. ఖాళీల భర్తీ ప్రక్రియ వెనువెంటనే చేపట్టాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారని, త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలవుతాయని తెలిపారు.
అనుభవమున్న ఉద్యోగుల సేవలు..
పరిపాలనలో అనుభవం గడించిన ఉద్యోగుల సేవలను వినియోగించుకొనేందుకే తెలంగాణ సర్కారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యోగుల విభజనలో భాగంగా కొంతమంది తెలంగాణకు, మరికొంతమందిని ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ఈ క్రమంలో తెలంగాణలోని కీలక శాఖల్లో ఉద్యోగుల కొరత ఏర్పడింది. నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాల భర్తీని చేపట్టినా కీలక విభాగాల్లో అనుభమున్న ఉద్యోగుల అవసరం ఏర్పడింది. ఇదే క్రమంలో ప్రతి ఏటా వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందుతుండటంతో ప్రభుత్వ విభాగాలన్నింటిలో ఉన్నతోద్యోగుల కొరత స్పష్టంగా కనిపిస్తున్నది. రిక్రూట్మెంట్ ద్వారా కొత్త ఉద్యోగులు చేరినా అనుభవలేమి కారణంగా చాలాపనులు ముందుకు సాగడంలేదు. ఈ నేపథ్యంలో అనుభవమున్న ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలన్న తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని పెంచింది. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఫలితంగా 2024 వరకు సుమారుగా 36వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగనున్నది.
ఉద్యోగుల అనుభవం.. సర్కారుకు లాభం
పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు ఆశల్లో తేలియాడుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జనవరి, ఫిబ్రవరి మినహా 2021లో 7,954 మంది, 2022లో 9,213 మంది, 2023లో 9,231 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా మరో మూడేండ్లు ఉద్యోగాల్లో కొనసాగనున్నారు. వాస్తవానికి దాదాపు 20 రాష్ర్టాలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్నది. తెలంగాణలో సైతం 2019లోనే మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న బోధన వైద్యుల వయోపరిమితిని 58 నుంచి 65 ఏండ్లకు పెంచారు. ఇటీవలనే ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏండ్లుకు పెంచారు. తాజాగా ఉద్యోగులందరి వయోపరిమితిని 61 ఏండ్లకు పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేశారు.
20 రాష్ర్టాల్లో 60 ఏండ్లు
మధ్యప్రదేశ్లో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 62 ఏండ్లు. దేశంలో ఇదే అత్యధికం.
పశ్చిమబెంగాల్లో మెడికల్ ప్రొఫెసర్లకు 65 ఏండ్లు, డాక్టర్లకు 62, ఇతర ఉద్యోగులకు 60 ఏండ్ల పరిమితిని అమలుచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, త్రిపుర, కర్ణాటక, అస్సాం, బీహార్, మేఘాలయ, ఛత్తీస్గఢ్, నాగాలాండ్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, మిజోరం, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్లలో 60 ఏండ్లు ఉండగా, ఒక్క తమిళనాడులో మాత్రమే 59 ఏండ్ల వయోపరిమితిని వర్తింపజేస్తున్నారు.
మనకన్నా తక్కువగా హర్యానా, హిమాచల్ప్రదేశ్, కాశ్మీర్, మహారాష్ట్ర, గోవాల్లో 58 ఏండ్లు, కేరళ, ఝార్ఖండ్లలో 56 సంవత్సరాలకే ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు.
గిరిజనులకు పాఠాలు చెప్తా
చెన్న వివేకానంద్.. నిజామాబాద్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్. పిల్లలకు పాఠాలు చెప్పడమంటే ఎంతో ఇష్టం. ఈ నెలలో పదవీ విరమణ చేయాల్సి ఉండటంతో ఆయన సతమతమవుతున్నారు. తనకు ఇష్టమైన బోధనా వృత్తిని వదులుకోవాల్సి వస్తుందని ఆవేదనలో ఉన్నారు. ఏజీ ఆఫీస్లో పెన్షన్ ఫైల్ను సైతం సమర్పించారు. ఈలోగా పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సంతోషంలో మునిగితేలుతున్నారు. గిరిజన తండాల్లోని పిల్లల కోసం శక్తినంతా ధారపోస్తానని అంటున్నారు.
కొత్త ఉత్సాహంతో పనిచేస్తా
ఎస్పీఆర్ మల్లేశ్కుమార్.. చార్మినార్ మండలం తాసీల్దార్. ఆయన ఏప్రిల్లో పదవీ విరమణ పొందాల్సి ఉంది. ఇందుకుగాను సర్వీసు బుక్ ఆప్డేట్ చేసుకోవడం, తనకు రావల్సిన ఈఎల్, ఇంక్రిమెంట్లు అన్నీ సవ్యంగా ఉన్నాయో లేదోనని చూసుకుంటున్నారు. 40 రోజుల్లో పదవీ విరమణ చేయాల్సిన తరుణంలో సర్కారు తీపికబురందించడంతో ఇప్పుడు సంతోషిస్తున్నారు. అటు పీఆర్సీ అమలు, ఇటు వయోపరిమితి పెంపుతో రాబోయే మూడేండ్లు మరింత కొత్త ఉత్సాహంతో పనిచేస్తానని అంటున్నారు.