హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఈటల రాజేందర్ మాటల్లో మనోవికారమే తప్ప, సత్యం ఎంతమాత్రం లేదని ఆర్థిక మంత్రి హరీశ్రావు శనివారం ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. ఆయన సమస్యలకు, లొల్లికి నైతిక బలం కోసం పదేపదే తన పేరును ప్రస్తావించటం ఈటల భావదారిద్య్రానికి, విజ్ఞత, విచక్షణలేమికి నిదర్శనమని మండిపడ్డారు. తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచిందన్నట్టుగా ఆయన వైఖరి ఉన్నదని విమర్శించారు. ఈటల పార్టీకి చేసిన సేవకన్నా, పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువని తెలిపారు. పార్టీని వీడినా టీఆర్ఎస్కు వీసమెత్తు నష్టం లేదని తేల్చిచెప్పారు. తన భుజాల మీద తుపాకీ పెట్టాలనుకోవటం, విఫలయత్నమే మాత్రమే కాదని.. వికార ప్రయత్నమని వర్ణించారు. ఈటల తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. పార్టీని వీడటానికి ఆయనకు అనేక కారణాలు ఉండొచ్చని, పార్టీలో ఉండాలా? వెళ్లిపోవాలా? అన్నది ఆయన ఇష్టమని పేర్కొన్నారు. టీఆర్ఎస్లో తాను నిబద్ధత, విధేయత, క్రమశిక్షణ గల కార్యకర్తనని హరీశ్రావు స్పష్టంచేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటివరకు పార్టీ ప్రయోజనాలే పరమావధి అని తేల్చిచెప్పారు. కార్యకర్తగా ఉన్న తనకు పార్టీ నాయకత్వం ఏ పని అప్పగించినా పూర్తిచేయటం తన విధి, బాధ్యతని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదని, తనకు గురువు, మార్గదర్శితోపాటు తండ్రి సమానులని చెప్పారు. ఆయన మాట జవదాటకుండా నడుచుకుంటానని పునరుద్ఘాటించారు. ‘గతంలో అనేకసార్లు ఇదే విషయాన్ని సుస్పష్టంగా అనేక వేదికలపై చెప్పాను. ఇప్పుడు మరోసారి చెప్తున్నా. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఇలాగే నడుచుకుంటాను’ అని తేల్చిచెప్పారు.