హైదరాబాద్/ సిటీబ్యూరో, మార్చి 9(నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీచేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు వెల్లువలా వస్తున్నది. హైదరాబా ద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ అభ్యర్థి ఎస్ వాణీదేవి, వరంగల్- ఖమ్మం- నల్లగొండ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికి తెలంగాణ పారామెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్, వొకేషనల్ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు అన్ని జిల్లాల కమిటీలు చేసిన మద్దతు తీర్మాన లేఖలను ఆయా జిల్లాల ప్రతినిధులతో కలిసి మంగళవారం ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావుకు అందజేశారు. పారామెడికల్, వొకేషనల్ కాలేజీలు మూసివేసే పరిస్థితులు నెలకొన్న సందర్భంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తమకు అందించిన సహకారం మరువలేమని అసోసియేషన్ ప్రతినిధులు గుర్తు చేసుకున్నారు. అందుకే అడగకపోయినా స్వచ్ఛందం గా ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డి గెలు పు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అసోసియేషన్ ప్రతినిధులను మంత్రి హరీశ్రావు అభినందించారు.
ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ అన్ని రంగాల్లో ముందున్నదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. విద్యా, ఉపాధి, సాగు, తాగునీరు, సంక్షేమం వంటి రంగాల్లో తెలంగాణ దేశానికే రోల్మోడల్గా నిలిచిందని చెప్పారు. కర్ణాటకలో 5 గంటల విద్యుత్తు సరఫరా చేస్తే అందులోనూ ప్రతి పది నిమిషాలకు కోతలున్నాయని ఆ రాష్ట్ర ప్రజలు చెప్తున్నట్టు హరీశ్రావు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 18 గంటలు విద్యుత్తు అందిస్తున్న నేపథ్యంలో అక్కడ పరిశ్రమలు పెట్టేందుకు ముందుకురావాలని పారిశ్రామికవేత్తలకు ఇటీవల అక్కడి ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి ఆహ్వానించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అదే తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తుతోపాటు పరిశ్రమలకు అంతకుముందున్న పవర్ హాలిడే అనేది లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్దని పేర్కొన్నారు.
దేశంలో అన్ని రాష్ర్టాల అసెంబ్లీ సమావేశాల్లో తాగునీరు, విద్యుత్తు, సాగునీరు వంటి ప్రాథమిక సమస్యలపై గొడవలు జరుగుతుంటే.. తెలంగాణలో మాత్రం ఈ సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని హరీశ్రావు వివరించారు. రాష్ట్రం ఏర్పడకముందు ఏ రోజు పత్రికలు చూసినా రైతు ఆత్మహత్యలే పతాక శీర్షికల్లో ఉండేవని, ఆ పరిస్థితిని రూపుమాపిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. పట్టభద్రుల ఎన్నికలు ప్రత్యేకమైనవిగా భావించి అసోసియేషన్ సభ్యులే కాకుండా వారి బంధుమిత్రులతో టీఆర్ఎస్కు ఓటు వేయించి ఓటింగ్శాతం పెంచాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ పారామెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోయేషన్ గౌరవాధ్యక్షుడు మోహన్రెడ్డి, అధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి దారాసింగ్, ముఖ్యసలహాదారు విజయ రవీందర్, ఉపాధ్యక్షుడు జహంగీర్ పాషా, జాయింట్ సెక్రటరీలు డేవిడ్, సోమ మల్లన్న తదితరులు పాల్గొన్నారు.