సిద్దిపేట : సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పుతామని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. నియోజకవర్గంలోని చిన్నగుండవెల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దేశ అభివృద్ధి కోసం అంబేద్కర్ ఆలోచనలను అమలు చేద్దామన్నారు. మూఢ నమ్మకాలను రూపుమాపి, విద్య పై అవగాహన కల్పిస్తూ ప్రజల్ని చైతన్యం చేయాలన్నారు. విద్య ఆవశ్యకతను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
అణగారిన వర్గాల పేదరికాన్ని రూపు మాపి, ఆర్థికాభివృద్ధి సాధనకై సీఎం కేసీఆర్ దళితబంధు తెచ్చారని మంత్రి గుర్తు చేశారు. విద్య, ఉద్యోగాల్లో, కాంట్రాక్టులలో కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. త్వరలోనే దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా దళితబంధు అమలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని స్పష్టం చేశారు. 13 వేల టీచర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. మంత్రి వెంట సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఎంపీపీ శ్రీదేవి, జెడ్పీటీసీ శ్రీహరి గౌడ్, గ్రామ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.