సిద్దిపేట : వచ్చే విద్యా సంవత్సరం బీ ఫార్మసీ కళాశాల అందుబాటులోకి రానుంది. రేపు సోమవారం బీఫార్మసీ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ కాలనీలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని మదీనా ఫంక్షన్ హాల్లో అబ్దుల్ రబ్ ఆరీఫ్ మెడికల్ కౌన్సిలింగ్ ఎక్స్ పర్ట్ ఆధ్వర్యంలో నీట్ విద్యార్థులకు జరిగిన ఎక్స్ పర్ట్ గైడెన్స్ క్యాంపు కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏంబీబీఎస్ సీట్లు పెరిగాయన్నారు. 70 ఏండ్లలో 800 సీట్లు ఉండేవనీ, కానీ తెలంగాణ ఏర్పడ్డాక ఏడేండ్లలో 2840 సీట్లు వచ్చాయని మంత్రి తెలిపారు.
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం పీజీ కోర్సుల్లో 50 సీట్లు వచ్చాయని వివరాలను వెల్లడించారు. సిద్దిపేటలో ఓ ప్రైవేట్, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రెండు ఉన్నాయని, ఇక్కడే ఏంబీబీఏస్ చదువొచ్చని పేర్కొన్నారు. పట్టుదలతో చదవాలని మంత్రి విద్యార్థులకు సూచించారు.