హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఒమిక్రాన్ వేరియంట్, కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్పై సోమవారం బీఆర్కే భవన్లో సీఎస్ సోమేశ్కుమార్, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా అధికారులు కరోనా కేసులు, ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలు, వాక్సినేషన్పై వివరించారు. రిస్కట్ దేశాల నుంచి రాష్ట్రానికి 1,805 మంది వచ్చారని, పాజిటివ్ వచ్చిన 13 మందికి ఒమిక్రాన్ నెగెటివ్గా నిర్ధారణ అయ్యిందని వివరించారు. వ్యాక్సినేషన్ వేగం మరింత పెంచాలని, ముఖ్యంగా రెండో డోసుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని, అప్పుడే పూర్తి స్థాయి రక్షణ లభిస్తుందని అన్నారు.
రెండో డోసు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపొద్దని, ఇతర వేరియంట్లను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27 వేల పడకలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు తమ వంతు బాధ్యతగా జాగ్రత్తలు పాటిస్తూ, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించాలని, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించాలని సూచించారు.