సిద్దిపేట : కూడవెల్లి వాగుకు కొత్త నడక నేర్పిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం ఆయన కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను విడుదల చేసి, నీటికి పూజలు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వాగుకు కొత్త దశ, దిశ, చూపి పునర్జన్మను ప్రసాదించారన్నారు. గుక్కెడు మంచినీటి కోసం తల్లడిల్లిన ప్రాంతం కాళేశ్వరం ప్రాజెక్టుతో జలకళను సంతరించుకుందన్నారు.
వంద మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తుకు గోదారమ్మను తీసుకువచ్చి కూడవెల్లి వాగుకు జలకళ తెచ్చామన్నారు. వాగులో గోదావరి జలాల విడుదల తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజన్నారు. నీటి విడుదలతో వెయ్యి వోల్టుల బల్బు వేస్తే వచ్చే వెలుగు రైతుల కళ్లల్లో కనిపిస్తుందన్నారు. వానాకాలం వస్తే కూడవెళ్లి వాగు నిండుతుందని తెలుసు, నేడు వర్షాలు లేకుండానే నీటితో ప్రవహిస్తోందన్నారు. వాగులోకి రోజుకు 8 వందల క్యూసెక్కుల నీటిని వదులుతామన్నారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించిన రోజు హేళన చేసిన వ్యక్తులు.. ప్రస్తుతం ఫలితాలు చూసి ఈర్ష్య పడుతున్నారన్నారు. కూడవెల్లి వాగులో గోదావరి జలాల విడుదలతో వేసవికాలంలో లక్షల రూపాయల విలువైన పంటను కాపాడు కోగలిగామన్నారు. తెలంగాణ రైతులు మొగులు దిక్కు చూడాల్సిన అవసరం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వర్షం కోసం ఎదురు చూపులు చూసే పరిస్థితి లేకుండా చూశామన్నారు.
స్వరాష్ట్రం సాధించుకున్నందు వల్లే సాగు, తాగునీటి బాధలకు శాశ్వత పరిష్కారం చూపగలిగామన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు మా పనితీరుతోనే సమాధానం చెబుతున్నామన్నారు. వాగులోకి నీటి విడుదలతో గజ్వేల్, తొగుట, మిరుదొడ్డి, దుబ్బాకతో పాటు ముస్తాబాద్ మండలాల రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు. 12వేల ఎకరాలకు నీరందుతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు కూడవెల్లి వాగు పరిసర ప్రాంతాల రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.