సిద్ధిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పాములపర్తి, వర్గల్ నవోదయ వద్ద కెనాల్ పనులను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. రేపు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. వర్గల్ మండలం హౌసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుండి హల్దీ కాలువలోకి గోదావరి జలాలను సీఎం విడుదల చేయనున్నారు. అనంతరం మర్కుక్ మండలం పాముల పర్తి గ్రామం వద్ద గజ్వేల్ కాలువలోకి గోదావరి జలాల విడుదల చేస్తారు. కొండపోచమ్మ సాగర్ నుంచి 90కి.మీ మేర ప్రయాణించి నిజాంసాగర్లోకి గోదావరి జలాలు చేరనున్నాయి.
‘గోదావరి జలాలతో 14,268 ఎకరాల్లో పంటలను కాపాడుకోవచ్చు. రైతుల దశ, దిశ మార్చే సందర్భం ఇది. భూ సేకరణకు సహకరించి గోదావరి జలాలు గజ్వేల్ కు వచ్చేందుకు సహకారం అందించిన రైతులందరికీ ధన్యవాదాలు. పంటను కాపాడేందుకు గోదావరి జలాలను విడుదల చేయనున్న సందర్భంగా రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు’ అని మీడియా సమావేశంలో హరీశ్ రావు పేర్కొన్నారు.