హైదరాబాద్ : హుజూరాబాద్లో ఉప ఎన్నిక వ్యక్తి స్వార్థం వల్ల వచ్చిందని.. ఈ ఎన్నికల్లో వ్యక్తి గెలువాలా? ప్రజలు గెలువాలా? ఆలోచించాలని మంత్రి హరీశ్రావు ప్రజలకు సూచించారు. ఈటల రాజేందర్ ఎన్నికల్లో గెలిచి మంత్రి అవుతడా?.. మంత్రిగా ఉండి పేదలకు ఇండ్లు కట్టివ్వని ఆయన.. గెలిచినంక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కడుతడా? అంటూ ప్రశ్నించారు. జమ్మికుంటలో జరిగిన విశ్మకర్మ సభలో మంత్రి పాల్గొన్నారు.
కార్యక్రమంలో శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనచారి పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కే మద్దతిస్తామని విశ్వకర్మలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వకర్మలకు వృత్తి కష్టమవుతోందని, ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. విశ్వకర్మలకు పోలీసుల వేధింపులు లేకుండా సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారన్నారు. వడ్రంగుల్లోనూ కొంత ఇబ్బందులున్నాయని, వారికి కర్ర దొరకడం లేదని, ఈ విషయంలో సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు కోరుతున్నారని, ఈ విషయం సీఎం మనసులో ఉందని.. ఒక్కొక్కటికి అమలు చేస్తున్నారన్నారు. 18 నెలలు కరోనాతో రాష్ట్ర ఆదాయం దెబ్బతిన్నదని, సీఎంకు అందరికీ సమానమేనని.. అన్ని కులాలు, మతాలను ఆయన సమానంగా చూస్తారన్నారు. విశ్వకర్మల వృత్తి దెబ్బతిన్నదని, రాబోయే రోజుల్లో సీఎం సమస్యలు పరిష్కరిస్తారని, విశ్వకర్మ కార్పొరేషన్కు నిధులు ఇచ్చి బలోపేతం చేస్తారన్నారు.
ఎవరికి ఓటేస్తే హుజూరాబాద్కు ప్రయోజనం?
సీఎం కేసీఆర్ పోచారం, జగదీశ్రెడ్డి, మధుసూదనాచారి, శ్రీనివాస్గౌడ్కు, తనకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించారని, మే అందరం ఇండ్లు నిర్మించి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించామన్నారు. హుజూరాబాద్లో మాత్రం ఈటల ఒక్క ఇల్లు కట్టలేదని, ఒక్కరినీ ఇండ్లలోకి పంపలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేదని, డిపాజిట్ కూడా రాదన్నారు. ఇక్కడ పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యేనన్నారు. ఓటు బీజేపీకి వేస్తే హుజూరాబాద్కు ప్రయోజనామా? టీఆర్ఎస్కు వేస్తే ప్రయోజనమా? ఆలోచించాలన్నారు.
సెంటిమెంట్లు పనికి రావు..
తాము ఆడపిల్లల కల్యాణలక్ష్మి, రైతులకు ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, లక్ష రుణమాఫీతో పాటు పలు పథకాలు అమలు చేస్తూ ఓట్లు అడుగుతున్నామన్నారు. బీసీ వర్గాలకు, పేదలకు, విశ్వకర్మలకు సాయం చేస్తామని చెబుతున్నామని.. బీజేపీ హుజూరాబాద్లో ఏం చెబుతారన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచాం.. విమానాలు, నౌకాశ్రయాలు, రైళ్లు.. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతం.. బీఎస్ఎన్ఎల్ అమ్మేశాం.. ప్రైవేటు రంగ సంస్థల్లో రిజర్వేషన్లు పోతయ్.. అందుకు ఓటేయమని అడుగుతున్నారా? అంటూ ప్రశ్నించారు. బండి సంజయ్ గెలిచాక ఒక్క ఊర్లో, మండలంలో పది లక్షల పని జరిగిందా? ఎంపీగా బండి ఏమీ చేయలేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈటల గెలిచి పని చేస్తారా? ఆలోచించాలన్నారు.
16న విశ్వకర్మల ఫంక్షన్ హాలుకు శంకుస్థాపన
సిద్దిపేటలో ఆచార్య జయశంకర్ సార్ పేరిట విశ్వకర్మలకు భవనం నిర్మించినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. హుజూరాబాద్లో ఎకరం స్థలం, కోటి రూపాయలతో భవనం అడిగితే ఇచ్చామని, అలాగే జమ్మికుంటలో అడిగితే మంజూరు చేసినట్లు చెప్పారు. హుజూరాబాద్లో ఈటల ఒక్క భవనమైనా నిర్మించారా ఆలోచించాలన్నారు. 16న హుజూరాబాద్లో విశ్వకర్మల ఫంక్షన్ హాలుకు శంకుస్థాపన కార్యక్రమం, విశ్వకర్మ గర్జన పెట్టుకొని.. విశ్వకర్మల ఐక్యతను తెలియజేద్దామని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ను సంప్రదించి సొంత స్థలాలు ఉన్న వారు ఇండ్లు కట్టుకునే కార్యక్రమం చేద్దామన్నారు.
హుజూరాబాద్ సంక్షేమానికి టీఆర్ఎస్ను ఆశీర్వదించాలి
హుజూరాబాద్ సంక్షేమం కోసం టీఆర్ఎస్ను ఆశ్వీరదించాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతలవి కోతలు.. వాతలు తప్పా చేసేందిమి లేదన్నారు. సిలిండర్ ధరలను పెంచారని, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చారన్నారు. ఆ చట్టాలను రద్దు చేయాలని ఆరు నెలల కిందట ఈటల చెప్పారని, దీనిపై కొట్లాడడని చెప్పి బీజేపీలో చేరారని విమర్శించారు. నల్ల చట్టాలు తెచ్చినం, మార్కెట్ రద్దయితది.. మద్దతు ధర దొరకదు.. నాకు ఓటేయండని ఈటల ఓట్లు అడుగుతారా? అని ప్రశ్నించారు. కరోనా కట్టడిలో కేంద్రం ఫెయిల్ అయ్యిందని, గుజరాత్కే టీకాలు ఇస్తున్నారన్నారని టీవీల ముందు ఖండించిన వారు.. ఇవాళ ఎలా సమర్థిస్తారన్నారు.
కరోనా విషయంలో కేంద్రం ఏం లాభం చేసింది.. ఇది కేవలం తన ప్రయోజనాల కోసమే తప్ప ప్రజల ప్రయోజనం కోసం కాదు. ఇందు కోసమేనా బీజేపీలో ఈటల చేరిందని ప్రశ్నించారు. ఓ వ్యక్తి స్వార్థమా.. ఓటు అడిగే ముందు ప్రజలకు చెప్పాలి కదా.. బీజేపీలో ఎందుకు చేరారో చెప్పాల్సిన అవసరం ఈటలకు ఉందా? లేదా? ప్రశ్నించారు. తాము చేసినవన్నీ చెబుతున్నామని, మీరేం చెబుతారని ప్రశ్నించారు. గెల్లు శ్రీనివాస్కు వ్యాపారం లేదని, రెండుగంటల భూమి ఉన్న సామాన్యుడు ఈటెలపై గెలువనున్నాడన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని, ఏడేళ్లలో చేయని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.