నిజామాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజాంసాగర్ నాన్ కమాండ్ ఏరియాలోని రైతులకు సాగు నీటి వసతి కల్పించేందుకు తెలంగాణ సర్కారు సన్నద్ధమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని పలు మండలాల్లో వేలాది ఎకరాల బీడు భూములను ఏడాది పొడవునా పంటలకు నెలవుగా మార్చేందుకు ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టనున్నది. ఇప్పటికే రూ.120 కోట్లతో సిద్ధాపూర్ రిజర్వాయర్, కాలువల ఆధునికీకరణకు అడుగులు వేసింది. రూ.106 కోట్లతో నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని జాకోరా, చందూర్-చింతకుంట ఎత్తిపోతల పథకాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిద్ధాపూర్ ద్వారా 10 వేల ఎకరాలకు ప్రాణంపోస్తుండగా, కొత్త ఎత్తిపోతల పథకాలతో 8 వేల ఎకరాలకు అదనంగా సాగునీటి సౌకర్యం కలుగనున్నది. జాకోరా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా వర్ని మండలంలోని తొమ్మిది గ్రామాలకు ప్రయోజనం దక్కనున్నది. మల్లారం, పొట్టిగుట్ట తండా, వర్ని, జాకోరా, కూనీపూర్, జలాల్పూర్, సయీద్పూర్, రాజ్పేట్, సంకోర గ్రామాల పరిధిలో 4,470 ఎకరాలకు సాగునీటిని మళ్లిస్తారు. ఇందుకోసం రూ.69.52 కోట్లు వెచ్చించనున్నారు. శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జాకోరా ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు.