కామారెడ్డి : డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై విమర్శలు చేసే పార్టీలు బాన్సువాడ నియోజకవర్గాన్ని చూడాలి. బాన్సువాడ వస్తే తెలంగాణ అభివృద్ధి అంటే చూపిస్తామని ప్రతి పక్షాలపై మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఎస్.ఆర్.ఎన్. కే డిగ్రీ కాలేజీలో నూతనగా నిర్మించనున్న నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాకు మార్గదర్శి అన్నారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభం ఉన్న నేత, బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధిపై దూరద్రుష్టి ఉన్న నేతే కాకుండా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో పోచారం ముందు వరసలో ఉన్నారని మంత్రి ప్రశంసించారు. స్పీకర్ పోచారంను అంకుల్ అంటూ మంత్రి సంబోధిస్తూ ప్రసంగాన్ని ప్రారంభిచడంతో సభా ప్రాంగణంలో నవ్వులు పూసాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యమేనా అని మాట్లాడిన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణంపై అవినీతి ఆరోపణలు చేసి విపక్షాలు బంగపడ్డాయన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు దేశంలో ఎక్కడా నిర్మించలేదు. ఇది ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ హయాంలో నిజాంసాగర్ ఎండిపోయింది నిజం కాదా అని సూటిగా ప్రశ్నించారు. రైతులకు సాగు, ప్రజలకు తాగునీరు ఇచ్చిన ఘనత ఒక్క టీఆర్ఎస్ పార్టీదేనని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో
అవరసం ఉన్నా లేకున్నా సిజేరియన్లు చేస్తున్నారు. ఇందుకు కుటుంబ సభ్యులే సహకరిస్తున్నారని, ఇది మంచి పరిణామం కాదన్నారు. తొందరపడి సిజేరియన్ లను ప్రోత్సహించ వద్దని మంత్రి సూచించారు. వీటి వల్ల శిశువుకు తల్లి ముర్రు పాలు అందడంలేదు. దీంతో శిశువులు చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ కార్యకర్తలు, వైద్యాధికారులు నార్మల్ డెలివరీ చేసుకునేలా కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు.
అలాగే బాన్సువాడ దవాఖానలో నూతన డాక్టర్లను మంజూరు చేస్తాం. నూతన పోస్టుమార్టం రూమ్ నిర్మాణం చేస్తామన్నారు. కరోనా సమయంలో అంగన్ వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు బాగా పనిచేశారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు సేవలు అందించడంలో ముందుండాలన్నారు.