సిద్ధిపేట : స్థానిక ఇండస్ట్రియల్ పార్కులో రూ.10కోట్లతో యువ పారిశ్రామికవేత్తల కోసం భవన నిర్మాణానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లగ్ అండ్ ప్లే విధానంలో అన్ని వసతులతో భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. దాదాపు 16 మంది యువ పారిశ్రామికవేత్తలకు చిన్న, మధ్య తరహా యూనిట్లు పెట్టుకునేందుకు అవకాశం ఉందన్నారు. సొంత డబ్బులతో భవనాన్ని నిర్మించుకొని పరిశ్రమ స్థాపించలేని వారికి ఇదో మంచి అవకాశమని చెప్పారు. అన్ని వసతులతో కూడిన ఈ భవనానికి అద్దె చెల్లించే ప్రాతిపాదికన పారిశ్రామికవేత్తలకు కేటాయించనున్నట్లు చెప్పారు.