సిద్దిపేట : రాష్ట్రంలో ఎక్కడా లేని విదంగా గౌరవెల్లి నిర్వాసితులకు ఎకరానికి రూ. 15 లక్షల పరిహారం ఇస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇప్పటి వరకు 97.82 శాతం భూసేకరణ జరిగిందని, రూ. 200 కోట్లు చెల్లించామని మంత్రి స్పష్టం చేశారు. నిర్వాసితులకు దండం పెట్టి చెబుతున్నా.. కాంగ్రెస్, బీజేపీ ట్రాప్లో పడకండి.. మీకు సమస్యలుంటే మీ తరుపున ప్రతినిధి బృందం వచ్చి అధికారులతో చర్చించండి. ప్రభుత్వం నిర్వాసితుల పట్ల సానుభూతితో ఆలోచిస్తుందని హరీశ్రావు స్పష్టం చేశారు.
సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డులో గౌరవెల్లి నిర్వాసితులతో హరీశ్రావు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్ ప్రాంత రైతులకు నీళ్లు రావొద్దనే లక్ష్యంగా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. నాడు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయం పనులు అడ్డుకొని, రైతులు పోలీసులపై తిరగబడేలా చేసి తప్పుకున్నారు. నేడు కూడా గౌరవెల్లి విషయంలో ప్రతిపక్షాలు అదే పని చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, రైతులు బాగుపడటం ఇష్టం లేకనే ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు యత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ వల్లే లక్షలాది ఎకరాల్లో కోట్లాది క్వింటాళ్ల పంట పండిందని తెలిపారు. సాగునీటిని చూసి రైతుల కళ్లలో ఆనందభాష్పాలు వస్తుంటే.. ప్రతిపక్షాలకు మాత్రం కన్నీళ్లు వస్తున్నాయని విమర్శించారు.
ఇరిగేషన్ అధికారులను అడ్డుకోవడం వల్లే.. వారి కోరిక మేరకు పోలీసుల భద్రత కల్పించామని తెలిపారు. అక్కడకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు వెళ్లి డిస్ట్రబ్ చేశారని పేర్కొన్నారు. గౌరవెల్లి నిర్వాసితులు ప్రతిపక్షాల ట్రాప్లో పడొద్దని సూచించారు. మీతో ఎన్నిసార్లు చర్చించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని హరీశ్రావు స్పష్టం చేశారు.
2013 చట్టం ప్రకారం ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తామని హరీశ్రావు ఉద్ఘాటించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం 3,816 ఎకరాల భూమి సేకరించామని తెలిపారు. ఇప్పటి వరకు 97.82 శాతం భూసేకరణ జరిగింది.. ఇంకా 2.1 శాతం మాత్రమే మిగిలి ఉందన్నారు. ఈ 84 ఎకరాల నిర్వాసితులు పరిహారం తీసుకోలేదని తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద 693 నివాసాలు ముంపునకు గురయ్యాయి. 2015లోనే 683 ఇండ్లకు రూ. 83 కోట్ల పరిహారం చెల్లించాం… కేవలం 10 ఇండ్లకు మాత్రం చెల్లించలేదు. ఇందులో 5 ఇండ్లు రీ సర్వే చేయనున్నారు.. మిగతా ఐదిండ్లలో కుటుంబ తగాదాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఆర్ అండ్ ఆర్ కింద మొత్తం 937 కుటుంబాలను గుర్తించాము. ఇందులో 927 కుటుంబాలకు పరిహారం చెల్లించాము. మిగతా 10 కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయని పేర్కొన్నారు.